India – Indonesia : భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో.. భారత్ తో కీలక ఒప్పంద కుదుర్చుకున్నరు. శనివారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో సమావేశమైన ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోసమక్షంలో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా ప్రత్యేక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగానే.. ఇరు దేశాల అవసరాలకు తగ్గట్టు రక్షణ ఉత్పత్తుల్ని తయారు చేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ద్వారా, రెండు దేశాలు శక్తివంతమైన భాగస్వాములుగా మారడంతో పాటు, తమ రక్షణ అవసరాలను స్వదేశీ ఉత్పత్తులతోనే తీర్చుకునేలా స్వయం సమృద్ధిని సాధించనున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా.. భారత్ – ఇండోనేషియా అనేక రక్షణ సామగ్రి, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాలను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు అంగీకరించాయి. ఇందులో ఎలక్ట్రానిక్స్, వైమానిక, మిసైల్, ఆర్మర్, నావల్ ఉత్పత్తులను సమిష్టిగా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నాయి. అలాగే.. వైద్యం, సముద్రయాన భద్రత, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ స్పేస్ వంటి అనుబంధ రంగాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.
భారత్ ఇప్పటికే అత్యాధునిక రక్షణ సాంకేతికతల అభివృద్ధి, ఉత్పత్తిలో మంచి స్థాయిలో ఉండగా.. ఇండోనేషియా సైతం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనుకుంటోంది. అందులో భాగంగానే..ఈ ఒప్పందం కుదుర్చుకుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. తాజా నిర్ణయంతో.. రెండు దేశాలు తమ ఉత్పత్తి సామర్థ్యాలను పంచుకోవడానికి, శక్తివంతమైన ఆయుధాల అభివృద్ధికి మార్గం సుగమం అవ్వచ్చని అంటున్నారు.
భారత్ కు ఇండోనేసియా కీలక భాగస్వామి అని తెలిపిన ప్రధాని మోదీ.. ఇండో పసిఫిక్ కూటమిలో ఇండోనేషియాకు భారత్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ప్రకటించారు. వాస్తవానికి.. భారత్ తాజా వ్యూహంలో పసిఫిక్ మహా సముద్రంలో పెరిగిపోతున్న చైనా ఆధిపత్యానికి గండి కొట్టడంతో పాటు సమీపంలోని దేశాలతో కలిసి పని చేయాలని భారత్ భావిస్తోంది. ప్రస్తుత ఒప్పందాలు.. ఆ అంశాల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే అని అంటున్నారు. చైనా వ్యవహారంతో ఆ ప్రాంతంలో ఇరుదేశాలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. సముద్ర రక్షణను బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. కృత్రిమమేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్టక్చర్ ఏర్పాటుపై పరస్పర సహకార కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇరు దేశాల తాజా ఒప్పందాలతో అనేక ప్రయోజనాలు రానున్నాయి. ముఖ్యంగా.. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడనున్నాయి. రక్షణ రంగంలోను ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఈ రంగంలోనూ మంచి వృద్ధిని ఆశించవచ్చని చెబుతున్నారు. అలాగే.. ఇరు దేశాలు ఆయుధాల్ని ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం, ఇప్పటికే ఉన్న టెక్నాలజీని అప్ గ్రేడ్ చేయడం సహా ప్రపంచ మార్కెట్లో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకునే వీలుంటుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజా ఒప్పందాల వల్ల భారత్ ఎగుమతులకు సరికొత్త అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా వంటి ఆసియా దేశాల్లో భారత రక్షణ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుందని అంటున్నారు.
భద్రతా, యుద్ధ సాంకేతికతలను పంచుకోవడం ద్వారా రెండు దేశాలు అవసరాలు తీరడంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే భద్రతా ముప్పుల్ని సైతం ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కలుగుతుందని అంటున్నారు. తన పర్యటన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్న ఇండోనేషియా అధ్యక్షుడు.. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇండోనేసియా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు.
Also Read : హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు.. తెలుగు వారిపై అభియోగాలు.. వెనక్కి తీసుకున్న యూఎస్ పోలీసులు..
భారత తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేసియానే ముఖ్య అతిథి అని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ.. ఈసారి 75వ వేడుకలకు కూడా ఆదేశమే ముఖ్య అతిథిగా హాజరవడం సంతోషంగా ఉందని తెలిపారు. చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ.. సముద్ర జలాల్లో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకాయానం సాగాలన్నారు. స్వేచ్ఛాయుత నౌకయానానికి అన్ని దేశాలు సహకరించాలంటూ.. చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాల కూటమిలో ఇండోనేషియా చేరికకు భారత్ గట్టి మద్ధతు తెలుపుతుందని అన్నారు.