Saudi Arabia Russia Ukraine War Peace Talks | సౌదీ అరేబియా వేదికగా అమెరికా-రష్యా దౌత్యవేత్తల మధ్య జరిగిన ఉక్రెయిన్ యద్ధం శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. రెండు దేశాల రాయబార కార్యాలయాల్లో సిబ్బంది పునరుద్ధరణ, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అవసరమైన చర్చల కోసం ఉన్నతస్థాయి బృందాల ఏర్పాటుతోపాటు, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, ఆర్థిక సహకారం కోసం మార్గాల అన్వేషణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే, డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య భేటీ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అధికారిక చర్చలు మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్హియా ప్యాలెస్ ఈ చర్చలకు వేదికగా నిలిచింది. అమెరికా మరియు రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో మరియు సెర్గీ లావ్రోవ్ చర్చల్లో పాల్గొన్నారు. చర్చల తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మీడియాతో మాట్లాడుతూ, మూడు ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. యుద్ధం ముగింపు మార్గాలను అన్వేషించేందుకు అవసరమైన చర్చల కోసం వీలైనంత త్వరలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
తాజాగా జరిగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్ అధికారులు పాల్గొనలేదు. ఈ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల మాట్లాడుతూ, కీవ్ భాగస్వామ్యం లేకుండా జరిగే ఈ చర్చల ద్వారా ఎటువంటి నిర్ణయం వెలువడినా దానిని అంగీకరించమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, అమెరికా మిత్రదేశాలైన యూరోపియన్ యూనియన్ కూడా తమను పక్కనపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణ నేపథ్యంలో అమెరికాతోపాటు ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. మాస్కో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అనేక చర్యలు తీసుకున్నాయి. దౌత్య సిబ్బందిపై బహిష్కరణ వేటుతో అమెరికా-రష్యా సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి.
Also Read: అమెరికా వీసా రూల్స్లో మార్పులు.. కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం!
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు పుతిన్ అంగీకరించారు. అవసరం అనుకుంటే ఇరు దేశాల అధ్యక్షుల మధ్య చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. అదే సమయంలో.. జెలెన్స్కీ అధ్యక్ష పదవి గురించి చట్టబద్ధతను ప్రశ్నించారు. ఆయన అధ్యక్ష పదవి ముగిసిందని గుర్తు చేసింది. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు మంగళవారం సౌదీ అరేబియా వేదికగా కీలక సంప్రదింపులు జరుగుతన్న తాజా స్పందన వచ్చింది.
2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. తాను అధికారంలోకి వస్తే ఆ యుద్ధాన్ని ఆపేస్తానని పలుమార్లు చెప్పిన డొనాల్డ్ ట్రంప్, అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. దానిలో భాగంగానే అమెరికా-రష్యాలు ఏళ్ల తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం అధికారికంగా చర్చలు మొదలుపెట్టాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్హియా ప్యాలెస్ వేదికగా ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులు మార్కో రూబియో మరియు సెర్గీ లావ్రోవ్ చర్చల్లో పాల్గొన్నారు.
అయితే ఈ చర్చల్లో ఉక్రెయిన్ ప్రతినిధులకు మాత్రం చోటు దక్కలేదు. “మా (ఉక్రెయిన్) గురించి మేము లేకుండా జరిగిన ఒప్పందాలను గుర్తించం” అని జెలెన్స్కీ ఈ చర్చల పట్ల అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ శాంతి చర్చల్లో ట్రంప్, పుతిన్ నేరుగా సమావేశం కాబోతున్నట్లు తెలిసింది. అయితే అది ఎప్పుడు జరుగుతుందనే విషయం మాత్రం స్పష్టంగా లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రస్తుతం యుఎఈ (దుబాయ్) పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన కూడా ఈ సమావేశాల్లో పాల్గేనే అవకాశం లేకపోలేదు.
ఇదిలా ఉంటే, మాస్కో విషయంలో ట్రంప్ చూపుతున్న సానుకూల వైఖరి పట్ల యూరోప్, నాటో కూటమి దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్తో తక్షణమే చర్చలు మొదలు పెట్టేందుకు పుతిన్ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు. నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని జెలెన్స్కీ ఇటీవల అన్నారు. ఉక్రెయిన్కు సాయం విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకున్న వేళ, ఐరోపా సమాఖ్య అంతర్మథనం చేస్తోంది. ఉక్రెయిన్ను ఒంటరిని చేయడం సరికాదని భావిస్తున్న పలు ఈయూ దేశాలు, కీవ్కు సైనిక సాయం అందించాలనే అభిప్రాయంపై సమాలోచనలు జరుపుతున్నాయి.