H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడే విద్యార్థులు, ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హెచ్-1బీ (H-1B) వీసాతో పాటు ఎఫ్-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్లపై కొత్తగా భారీ రుసుములను విధించేందుకు అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ కొత్త రూల్స్ ను రెడీ చేసింది. దీని ప్రకారం హెచ్-1బీ వీసా రుసుమును ఏకంగా 1,03,265 డాలర్లకు పెంచే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.
కార్పొరేట్ ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ (Fragomen) విశ్లేషణ ప్రకారం.. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులు, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరాలని భావిస్తున్న విదేశీ విద్యార్థులపై దీని ప్రభావం పడనుంది. అలాగే వీరికి స్పాన్సర్షిప్ ఇచ్చే అమెరికన్ కంపెనీలపై కూడా విపరీతమైన విపరీతమైన ఆర్థిక భారం పెరగనుంది.
అయితే ఈ మార్పుల వల్ల అత్యధికంగా భారతీయులే నష్టపోనున్నారు. ఎందుకంటే మొత్తం హెచ్-1బీ వీసా లబ్ధిదారుల్లో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. 2024 సంవత్సరంలో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) మొత్తం 3,99,402 హెచ్-1బీ పిటిషన్లను ఆమోదించగా.. అందులో భారతీయ మూలాలు ఉన్నవారే 71 శాతం ఆమోదాలు పొందడం విశేషం.
ఫ్రాగోమెన్ అందించిన వివరాల ప్రకారం.. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (OMB) పరిశీలనకు వెళ్లింది. అప్లికేషన్లపై దాదాపు 1,00,000 డాలర్ల రుసుము విధించే ప్రతిపాదనను ఓపీటీ ఆగస్టు 20వ తేదీనే ఓఎంబీ సమీక్షకు పంపింది. కొన్ని రకాల హెచ్-1బీ పిటిషన్లపై కొత్త ఫీజు విధించే ప్రతిపాదనను ఆగస్టు 19నే పరిశీలించి ఆమోదించినట్లు ఫ్రాగోమెన్ పేర్కొంది. అయితే గతంలోనే హెచ్-1బీ ఫీజును లక్ష డాలర్లు చేయాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించగా అమెరికన్ న్యాయస్థానం స్టే విధించింది. ఇప్పుడు మరోమారు ట్రంప్ సర్కార్ ఫీజు పెంచేందుకు రెడీ అవుతుండటం ఆసక్తి రేపుతోంది. అయితే ఈ ప్రతిపాదనల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి ఉంది.
Also Read: కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక
కేవలం ఫీజుల పెంపే కాకుండా ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 60 రోజుల ‘గ్రేస్ పీరియడ్’ (Grace Period) రద్దు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగం ఊడిన వెంటనే బాధితులు వారి డిపెండెంట్లు ఎలాంటి సమయం లేకుండా తక్షణమే అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయం కంటే ముందే ఉద్యోగం పోతే.. అక్కడ ఉండటం చట్టవిరుద్ధంగా పరిగణించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో 52 లక్షలకు పైగా భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమలులోకి వస్తే వారిపై ఇది తీవ్రమైన ప్రభావం చూపనుంది.
Also Read: కుంభమేళా ఖర్చులో 0.1% చాలు.. వందలాది స్కూళ్లను కాపాడొచ్చు.. సుప్రీంకోర్టు జడ్జి సంచలనం!