US Launches Operation Economic Outcast Against Iran: ఇరాన్పై సైనిక దాడులతో విరుచుకుపడుతున్న అమెరికా.. ఇటీవలే, ఆ దేశంపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించింది. టెహ్రాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలను డాలర్ సిస్టమ్ నుంచి దూరం చేస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ఏదోరకంగా ఇరాన్ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరుచేయడమే లక్ష్యంగా అగ్రరాజ్యం ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. ఇందులో భాగంగా యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్.. సరికొత్త ఆర్థిక ఆంక్షల ప్యాకేజీని ప్రకటించారు.
ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ పేరిట.. ఇరాన్ ఆర్థిక జీవనాధారాలను దెబ్బతీయాలని యూఎస్ భావిస్తోంది. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తూ, మనీలాండరింగ్కు సహకరించే ఏ దేశమైనా, సంస్థనైనా డాలర్ వ్యవస్థ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలతో సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తూ.. దాదాపు 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది.
అమెరికా ప్రకటనపై.. ఇరాన్ దీటుగా స్పందించింది. ట్రంప్ ప్రభుత్వం విసురుతున్న ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ దగ్గర రెండేళ్ల ప్లాన్ రెడీగా ఉందని.. ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదే స్పష్టం చేశారు. తమ దేశ ప్రజల సంకల్పాన్ని పరీక్షించేందుకు అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రతిసారీ విఫలమైందన్నారు. ఈసారి కూడా ఓటమి తప్పదన్నారు. ఇతర దేశాలతో తమకున్న ఆర్థిక సంబంధాలను తెగ్గొట్టే శక్తి.. అమెరికాకు లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ కొట్టిపారేశారు.
అమెరికా బెదిరింపులను తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలేవీ పట్టించుకోవడం లేదని, ఈ మేరకు తమకు స్పష్టమైన సంకేతాలు అందాయన్నారు. మరోవైపు, అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించారు. ఇరాన్తో పాటు ఆ దేశానికి అండగా నిలుస్తున్న వారికి ఈ ఆంక్షల ద్వారా భారీ మూల్యం తప్పదని అభిప్రాయపడ్డారు.
ఒకవైపు సైనిక దాడులు, మరోవైపు కఠిన ఆర్థిక ఆంక్షలతో అమెరికా ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తుంటే.. తమ దగ్గర ఆల్టర్నేట్ ప్లాన్స్ రెడీగా ఉన్నాయని టెహ్రాన్ చెబుతోంది. ఈ ఆర్థిక పోరు అంతర్జాతీయంగా ఏ పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.
Also Read: పాఠశాలల్లో హిజాబ్ కంటే.. యూనిఫామే ముఖ్యం.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు