India Vs Turkey : భారతీయులు ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎంతగా రగిలిపోతున్నారో.. టర్కీ మీద కూడా అంతే కోపంతో ఉన్నారు. పాపిష్టి పాకిస్తాన్కు టర్కీ డ్రోన్లు సరఫరా చేసిందనే విషయం తెలిసి భగ్గుమంటున్నారు. గతంలో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఇండియా భారీ సాయం చేసింది. ఆ సాయాన్ని మరిచి.. మనకు శత్రుదేశమైన పాక్కు డ్రోన్లు అందజేసింది. ఆ టర్కీ మేడ్ సూసైడ్ డ్రోన్లతోనే భారత్పై దాడికి తెగబడింది పాకిస్తాన్. ఏకంగా 400 డ్రోన్లలో ఇండియాపై అటాక్ చేసింది. మన రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండి ఆ డ్రోన్లు అన్నిటినీ కూల్చివేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే, మనకూ పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అందుకే, పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన టర్కీ పేరు ఎత్తితేనే ఇండియన్లు మండిపడుతున్నారు. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్ను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఫుల్ క్యాంపెయిన్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో టర్కీ గురించి మరో ఉలిక్కిపడే అప్డేట్ రావడం మరింత కలకలం రేపుతోంది.
పాక్ ఆర్మీకి టర్కీ ట్రైనింగ్
పాకిస్తాన్కు డ్రోన్లు అందజేయడమే కాదు.. ఆ డ్రోన్లు ఎలా వాడాలో ట్రైనింగ్ ఇచ్చేందుకు, దాడిని పర్యవేక్షించేందుకు.. తమ దేశానికి చెందిన మిలటరీ అధికారులను కూడా పాక్కు పంపించిందట టర్కీ. వందల సంఖ్యలో ‘అసిస్ గార్డ్ సోనగర్’ కేటగిరీకి చెందిన BAYRAKTAR TB2, YIH డ్రోన్లు టర్కీ నుంచి పాకిస్తాన్ చేరాయి. ప్రత్యేక విమానాల్లో వాటిని తీసుకొచ్చారు. డ్రోన్లతో పాటు వాటిని సరిగ్గా ఆపరేట్ చేసేలా ట్రైనింగ్ ఇచ్చేందుకు కొందరు టర్కీ ఆర్మీ ఎక్స్పర్ట్స్ కూడా పాక్కు వచ్చారని సమాచారం. ఆ నిపుణుల సూపర్విజన్లో సూసైడ్ డ్రోన్లతో భారత్లోని 36 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించింది. మన డిఫెన్స్ సిస్టమ్ వాటిని స్మాష్ చేసేసింది. మరోవైపు, ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఇండియన్ ఆర్మీ చేసిన అటాక్లో ఇద్దరు టర్కీ సోల్జర్స్ చనిపోయినట్టు తెలుస్తోంది.
టర్కీని దెబ్బ కొట్టాల్సిందే..
యుద్ధం మొదలవగానే.. పాకిస్తాన్కు బహిరంగంగానే మద్దతు ప్రకటించింది టర్కీ. తన నేవీ వార్ షిప్ను కరాచీకి పంపించింది. ఇండియా అంటే టర్కీకి ఎందుకంత కోపమో మరి. ఇన్నాళ్లూ భారత్ నుంచి టర్కీ భారీగా అల్యూమినియం, ఆటో కాంపోనెంట్స్, టెలికాం, ఎలక్ట్రికల్ మెషినరీని దిగుమతి చేసుకునేది. వాటితో డిఫెన్స్ ఉత్పత్తులు తయారు చేసి.. పాక్కు విక్రయించనట్టు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. టర్కీ తీరుతో రగిలిపోతున్న భారత్ ముందుగా యాపిల్, మార్బుల్ దిగుమతులను తగ్గించుకుని వాణిజ్యంగా దెబ్బ కొట్టాలని చూస్తోంది. మరోవైపు, ఇప్పటికే టర్కీకి చెందిన TRT బ్రాడ్కాస్ట్ను Xలో నిలిపివేసింది భారత్.