US Embassy Cancel Indians Visa Application| భారతదేశంలోని అమెరికా ఎంబసీ ఇటీవల వేలాది వీసా దరఖాస్తులను రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాలను నిరోధించే చర్యల్లో భాగంగా సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ఎంబసీ ప్రకటించింది. రెండు నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా కొత్త ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్, వీసా విధానాలను అమలు చేస్తోంది.
ఎందుకు రద్దు చేసింది?
అమెరికా ఎంబసీ వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్లో అవకతవకలపై దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియలో “బ్యాడ్ యాక్టర్స్” (అక్రమార్కులు) లేదా ఆటోమేటెడ్ బాట్స్ (మెషీన్లు) ద్వారా అపాయింట్మెంట్ సిస్టమ్లో జరుగుతున్న ఉల్లంఘనలను గుర్తించిన రాయబార కార్యాలయం ఆయా ఖాతాలను సస్పెండ్ చేసింది. ఇలా చేసిన సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. తమ షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. తక్షణమే ఈ నియామకాలను రద్దు చేస్తున్నామని, అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేస్తున్నామని పేర్కొంది.
Also Read: చిన్న జ్యూస్ వ్యాపారికి రూ.7.7 కోట్ల ట్యాక్స్ నోటీస్.. ఆందోళన చెందుతున్న నిరుపేద
భారతీయులే ఎక్కువ
విద్య, ఉద్యోగం, పర్యాటకం.. ఇలా వివిధ ప్రయోజనాల కోసం యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించే అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉన్నారు. భారతదేశంలో అమెరికా వీసా దరఖాస్తులు చేసుకునేవారు.. గణనీయంగా బ్యాక్లాగ్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీ1 (వ్యాపార వీసా), బీ2 (పర్యాటక వీసా) దరఖాస్తుదారులకు ఎక్కువ జాప్యం ఎదురవుతోంది. 2022-23 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నవారు 800 నుంచి 1000 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
ఇతర దేశాల్లో అవకాశాలు
ఈ సుదీర్ఘ వేచివున్న సమయాన్ని తగ్గించడానికి, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భారతీయ దరఖాస్తుదారులకు అమెరికా వీసా అపాయింట్మెంట్లను తెరిచారు. వీసా వెయిటింగ్ టైమ్ గురించి భారత ప్రభుత్వం ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటుంది. 2022లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో వీసా జాప్యంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆందోళన తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అప్పటి బైడెన్ ప్రభుత్వం వివరించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇటీవల జనవరిలో వాషింగ్టన్ వెళ్లిన జైశంకర్, కొత్త అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మరోసారి ఈ అంశాన్ని చర్చించారు.
సహనానికి పరీక్ష
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత, దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి, ప్రత్యేకంగా విదేశీయులపై విధించిన నియంత్రణలు మరింత కఠినంగా మారాయి. ఇటీవల, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గ్రీన్ కార్డ్ ఉన్నవారంతా శాశ్వత నివాసితులేమి కారని పేర్కొన్నారు. దీంతో భారతీయ వలసదారులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు అమెరికాలో వీసా హోల్డర్లపై కఠినమైన పర్యవేక్షణ జరుగుతోంది. H-1B, F-1, గ్రీన్ కార్డ్ వీసా హోల్డర్ల విద్య, ఉద్యోగ వివరాలు సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నారు. అమెరికాలో నివసించే భారతీయులు.. వారి పత్రాలను ఎంట్రీ పాయింట్లో చూపించాల్సి వస్తోంది, ఇది వారికీ ఇబ్బంది కలిగిస్తోంది.
అమెరికాలో విదేశీ విద్యార్థులపై కూడా కఠినతమ విధానాలు అమలవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో F-1 వీసాలకు 41 శాతం దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఇది ఒక దశాబ్దంలో అత్యధిక తిరస్కరణ రేటు. 2024లో భారతీయ విద్యార్థుల వీసాలు 38 శాతం తగ్గాయి.