మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యశ్వాడి మారుతి దేవాలయంలో నిర్మాణంలో ఉన్న సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో సుమారు 30 నుండి 40 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలిసింది.
శనివారం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఆలయం ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న మండపం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు. అదే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యకు సంబంధించి జిల్లా యంత్రాంగం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
శిథిలాల కింద చిక్కుకున్న భక్తులను రక్షించడానికి రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి అధికారులు పెద్ద సంఖ్యలో అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. శిథిలాలను తొలగించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Also Read: కొత్తగా ఏదైనా చేయాలంటూ.. ఉరేసుకున్న నీట్ విద్యార్థి.. ఖంగుతిన్న పోలీసులు!