Railway Lines: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో బళ్లారి–గుంతకల్ మార్గానికి సంబంధించి ఒక కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రధాన ప్రాంతాల మధ్య కొత్తగా 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
46 కిలోమీటర్లు.. రూ. 1,264 కోట్లు!
ఈ ప్రాజెక్టు కింద బళ్లారి నుండి గుంతకల్ మధ్య ఉన్న 46 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని మరింత విస్తరించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,264 కోట్లను కేటాయించింది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు తీవ్ర తీవ్ర ఆలస్యానికి గురవుతున్నాయి. కొత్త లైన్ల వల్ల రైళ్ల సామర్థ్యం పెరిగి, సమయం ఆదా అవుతుంది.
నదులపై మెగా వంతెనలు.. ఇంజనీరింగ్ అద్భుతం
ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా వేదవతి నదిపై అత్యంత కీలకమైన 762 మీటర్ల పొడవైన ఒక మెగా వంతెనను నిర్మించనున్నారు. అంతేకాకుండా ఈ 46 కిలోమీటర్ల పరిధిలో మరో 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
మూడేళ్లలో పూర్తి చేసాలా ప్రణాళిక
ఈ భారీ ప్రాజెక్టును వచ్చే మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ పనులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలు మరింత పటిష్టమవుతాయి. ముఖ్యంగా వ్యాపారులకు సరుకు రవాణా చాలా సులభతరం కానుంది. ఈ నిర్ణయం పట్ల ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.