Komatireddy Rajgopal Reddy: యాదాద్రి భువనగిరి జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తన రాజకీయ భవిష్యత్తు మరియు మంత్రి పదవిపై ఘాటుగా స్పందించారు. రాబోయే రోజుల్లో తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ మంత్రిని కాకపోతే, భవిష్యత్తులో ముఖ్యమంత్రిని కూడా అవుతానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటాను” అని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. తనకు ఎవరినీ అడుక్కోవడం రాదని, అధికార పీఠాన్ని లేదా పదవులను గౌరవప్రదంగా దక్కించుకోవడమే తన పద్ధతి అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తనకు మర్యాదగా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవి కోసం తాను వేచి చూసే పరిస్థితిని దాటిపోవద్దని, ఒకవేళ అది జరగకపోతే తానే స్వయంగా పదవిని లాక్కునే వరకు తెచ్చుకోవద్దని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న చర్చ మొదలైంది.
రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా మంత్రి పదవి, తన రాజకీయ ప్రాధాన్యత గురించి పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేబినెట్ విస్తరణ జరిగిన సమయంలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను గుర్తించాలని, సముచిత స్థానం కల్పించాలని ఆయన పరోక్షంగా అధిష్టానాన్ని కోరారు. తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై కూడా ఆయన విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారి, క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్ళింది.
Read Also: Congress Victory: మున్సిపల్ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. అఖండ విజయంపై భట్టి, పొంగులేటి హర్షం!