Pollution Boards: గాలిలో నాణ్యత పరిమాణం ఎంత? ఏ ప్రాంతంలో ఎంత పొల్యూషన్ ఉందనేది డిస్ ప్లే చేసేందుకు కోట్ల రూపాయలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రతి నెల లక్షల రూపాయల్లో ఖర్చుచేస్తున్నది. కానీ అవి పనిచేయవు… సమాచారం తెలుపవు. కేవలం నామ్ కే వాస్తేగా.. ఉత్సవ విగ్రహాల్లా మారాయి. అధికారుల పర్యవేక్షణ కోరవడటంతోనే ఈ పరిస్థితి దాపురించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలలు.. ఏండ్లు గడుస్తున్నా వాటికి మరమ్మతులు చేయరు..కానీ వాటి పేరిట మాత్రం లక్షల్లో మాత్రం మెయింటెన్స్ ఖర్చు చేపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కాలుష్యం పెరుగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసింది. ప్రజలకు కాలుష్యం పెరిగితే జరిగే నష్టాలను వివరించి తగ్గించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పీసీబీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో, నల్లగొండ, కరీంనగర్ తో పాటు పలు జిల్లాల్లోనూ పొల్యూషన్ వివరాలు తెలియజేసేందుకు డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కో బోర్డుకు కోటిరూపాయల వరకు ఖర్చుచేసినట్లు సమాచారం. అందుకోసం మరమ్మతులు, పర్యవేక్షణ కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ బోర్డులు మాత్రం పనిచేయవు. సమాచారం తెలుపు. కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారాయి. ఎందుకు ఏర్పాటు చేశారు… వాటిని నిరంతరం పర్యవేక్షించకుండా ఎందుకు విస్మరించారో సంబంధిత అధికారులకే తెలియాలి.
పీసీబీ అధికారులు రాష్ట్ర సచివాలయం ఎదురుగా, అమరజ్యోతి సమీపంలో పొల్యూషన్ వివరాలు తెలిపేందుకు డిస్ ప్లే బోర్డును ఏర్పాటుచేశారు. అది గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. దానిపై పర్యవేక్షణ లేదు. ప్రజలకు ఏం సమాచారం ఇస్తున్నారో తెలియదు. ఇది పీసీబీ అధికారుల పనితీరుకు నిలువెత్తు నిదర్శనం. నిత్యం వేలాది మంది ప్రజలు అక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్ర సచివాలయానికి సైతం రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. అక్కడే బోర్డు పనిచేయకపోవడం అధికారులు పనితీరుకు అద్దంపడుతోంది. ఇదే ఇలా ఉంటే మిగతా బోర్డుల పరిస్థితి ఏంటనేది చెప్పకనే చెప్పొచ్చు. సచివాలయంలో ఏర్పాటు చేసింది మాత్రం పనిచేస్తుంది. అక్కడ నిత్యం ఉన్నతాధికారులు ఉండటంతోనే పర్యవేక్షణ చేస్తున్నారు..కానీ సమీపంలో ఉన్నదానిపై మాత్రం దృష్టిసారించకపోవడం విమర్శలకు దారితీస్తుంది.
కోట్ల రూపాయలతో డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. చేతులు దులుపుకున్నారు. ప్రతి నెల వాటి మెయింటెన్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ నిధులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. పర్యవేక్షణ లేనప్పుడు ఎలా ఎందుకు కర్చుపెడుతున్నారనేది సంబంధిత అధికారులకే తెలియాలి. వేలల్లో వేతనాలు తీసుకుంటూ ఆఫీసుకు వచ్చి సీట్లో కూర్చొని… సమయం అయిపోగానే వెళ్లిపోతున్నారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పొల్యూషన్ వివరాలు తెలియజేసేందుకు ఎన్ని బోర్డులు ఏర్పాటు చేశారో తెలియని అధికారులు పేర్కొంటుండటం శోఛనీయం. వివరాలు తెలిసినా బయటకు చెప్పకూడదని చెప్పడం గమనార్హం. అంటే ప్రజలకు ఎన్నిబోర్డులు ఏర్పాటు చేశారు? ఎలా అవగాహన కల్పిస్తున్నారు? అనేది తెలియకుండదనే వారి అభిప్రాయమనేది స్పష్టమవుతుంది. వివరాలు తాను కాదని ఒకరు… మరొకరని ఒకరు ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటుండటం వారి పనితీరు స్పష్టమవుతోంది. పీసీబీ అధికారులు ఏం చేస్తున్నారు…ఎం విధులు నిర్వహిస్తున్నారనేది వారికే తెలియాలి.
గత ప్రభుత్వ పాలనలో అనుసరించిన విధానాన్నే పీసీబీ అధికారులు కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతుంది… పర్యావరణశాఖ మంత్రిసైతం ఉన్నారు. అయితే అధికారుల పనితీరుపై మంత్రి దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. పొల్యూషన్ నివారణకు అవగాహన సదస్సులు, పొల్యూషన్ వివరాలు తెలిపే బోర్డులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లోనూ సదస్సులు నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై దృష్టిసారించి చర్యలు తీసుకుని పీసీబీని ప్రక్షాళన చేస్తే తప్ప ఆ శాఖ ప్రజలకు చేరువకాదని, పొల్యూషన్ తగ్గే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.