Mancherial District: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల పాఠశాలలో తీవ్ర కలకలం రేగింది. తమ ప్రిన్సిపాల్ రమాదేవి తమను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ లేఖ పాఠశాల పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థినులు తమ లేఖలో ప్రిన్సిపాల్ రమాదేవిపై సంచలన ఆరోపణలు చేశారు. ఏదైనా విషయం అడిగితే లేదా సమస్య చెబితే, ‘మీరు రైతు కూలీ పనులు చేసే వారి బిడ్డలు’ అంటూ అవహేళన చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక, ఏదైనా పని చేయమని అడిగితే, దానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రవర్తన మానసిక వేధింపులకు గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు.. ప్రిన్సిపాల్ వేధింపుల నుండి విముక్తి పొందేందుకు విద్యార్థినులు ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు అందరూ పాఠశాలకు రావాలని కోరుతూ వారు తమ లేఖలో స్పష్టంగా రాశారు. ఈ విషయం గురించి మీడియాకు కూడా సమాచారం ఇచ్చి రావాలని లేఖలో విద్యార్థినులు పేర్కొన్నారు. లేఖ అందుకున్న తల్లిదండ్రులు సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్నారు. వారు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. దీనితో ప్రిన్సిపాల్ రమాదేవి ఆందోళన చెందారు. తన పేరు మీడియాలో వస్తుందని, ఉన్నతాధికారులు తనపై చర్యలు తీసుకుంటారని ఆమె భయపడ్డారు. వెంటనే ఆమె తల్లిదండ్రులను పదవ తరగతి విద్యార్థులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, ప్రిన్సిపాల్ రమాదేవి వివాదాస్పద చర్యకు పాల్పడ్డారు. బయటి వ్యక్తులు ఎవరూ పాఠశాల లోపలికి రాకుండా ఉండేందుకు ఆమె పాఠశాల గేట్లకు తాళం వేసి ఎవరిని అనుమతించలేదు. ఈ చర్య మరింత విమర్శలకు దారితీసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్ రమాదేవిని మీడియా ప్రతినిధులు సంప్రదించి ప్రశ్నించగా, ఆమె దాటవేసే సమాధానాలు చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపాల్ స్పందనపై తల్లిదండ్రులు విద్యార్థినులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థినుల లేఖ ఆందోళన విషయం ఆలస్యంగా తమ దృష్టికి వచ్చిందని మండల విద్యాధికారి (MEO) పోచయ్య తెలిపారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా, ఈ విషయంపై తప్పకుండా విచారణ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకునేందుకు పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులకు న్యాయం జరిగేలా చూస్తామని పోచయ్య తెలిపారు.
ఈ ఘటనతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల పాఠశాలలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థినుల భవిష్యత్తు వారి మానసిక ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ALSO READ: Namo Bharat Train: నమో భారత్ లో పార్టీలు, ఫోటో షూట్స్.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!