పెళ్లయిన వెంటనే బిడ్డను కనాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా పిల్లల పుట్టడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం మరింతగా బలపడుతుందని, వారు విడిపోకుండా కలిసి ఉంటారని చెబుతూ ఉంటారు. అందుకే వివాహమైన వెంటనే కుటుంబ పెద్దలు భార్యాభర్తల పై బిడ్డను కనాలని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తారు. కానీ అధ్యయనం చెబుతున్న ప్రకారం బిడ్డ పుట్టిన తర్వాతే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. బిడ్డ పుట్టాకే విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది.
భార్యాభర్తల పై బిడ్డ పుట్టాక ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశంపై బీబీసీ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. దీన్ని 2021లో నిర్వహించారు. బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి నలుగురు తల్లుల్లో ఒకరు, ప్రతి 10 మంది తండ్రులలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనం కనిపెట్టింది.
పిల్లలు పుట్టక ముందే ఆనందం
పిల్లలు పుట్టిన తర్వాత కంటే పిల్లలు పుట్టకముందే వివాహిత జంటలు ఆనందంగా ఉన్నట్టు అధ్యయనం చెబుతోంది. పిల్లలు లేని జంటలే తమ సంబంధంలో ఎక్కువ సంతృప్తిగా ఉన్నట్టు ఈ పరిశోధన వెల్లడించింది. తల్లులు కాలేకపోయినా మహిళలు తమ సంతోషంగానే ఉన్నామని కూడా చెప్పినట్టు అధ్యయనం వివరిస్తోంది. తమ భర్తతో అనుబంధం ఎక్కువగానే ఉందని వారితో ఎక్కువ సమయం గడపగలుస్తున్నామని కూడా మహిళలు వివరించినట్టు అధ్యయనం చెబుతోంది.
పిల్లల వల్లే విడాకులా?
పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య బంధం పదేళ్లలోపే క్షీణిస్తోందని, అవి విడాకులకు దారితీస్తోందని కూడా ఈ అధ్యయనం వివరిస్తోంది. దీనికి కారణం పిల్లల పుట్టాక బాధ్యతలు పెరగడం, భార్యాభర్తల మధ్య ఎక్కువ సమయం గడపలేకపోవడం, ఆర్థిక సమస్యలు, ఇంటి పనులు పెరగడం వంటివి ఉన్నాయి.
పిల్లలు పుట్టాక ఏం జరుగుతుంది?
పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలిద్దరికీ నిద్ర తగ్గిపోతుంది. పసిపిల్లలకు ఎక్కువ సేపు పనులు చేయాల్సి వస్తుంది. దీనివల్ల రాత్రి మేలుకొని ఉండాల్సి వస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు ఈ పరిస్థితుల వల్ల విపరీతంగా అలసిపోతున్నారు. చిన్న విషయాలకి కోపతాపాలకు గురవుతున్నారు. గొడవలు పడుతున్నారు విడిపోయేదాకా పరిస్థితులను తెచ్చుకుంటున్నారు.
బాధ్యత నుంచి తప్పించుకుంటారా?
పిల్లలు పుట్టాక వారి బాధ్యతలను చూసుకునేందుకు కూడా వంతులు వేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ కాలంలో తల్లులు కూడా ఉద్యోగం చేయడం వల్ల పిల్లలను ఎవరు చూసుకోవాలన్న దానిపై ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. పిల్లల బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కూడా కొంతమంది తండ్రులు భార్యను వదిలిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం
పిల్లలు కలగకముందు భార్యాభర్తలు ఇద్దరే ఉండేవారు. వారిద్దరూ కూడా తమ పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాక ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపేవారు. దీనివల్ల వారి బంధం పటిష్టంగా ఉండేది. కానీ పిల్లలు కలిగాక ఆ పిల్లాడి బాధ్యతల విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సమయాలను అడ్జస్ట్ చేసుకోలేకపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతోంది. అలాగే బిడ్డ పుట్టాక ఆ బిడ్డకు ఒక వయసు వచ్చే వరకు కూడా ఎలాంటి ప్రయాణాలు చేయలేకపోతున్నారు. కాలక్షేపం కోసం రిలాక్స్ అవ్వడానికి కూడా బయటికి వెళ్లలేరు. భోజనం చేసేందుకు కూడా రెస్టారెంట్ కి వెళ్లేందుకు బిడ్డను వదిలేందుకు తల్లి ఇష్టపడదు. ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య దూరానికి కారణం అవుతున్నాయి.
ఇలా చేస్తేనే.. కలిసి ఉండగలరు
పిల్లలు కలిగాక కూడా భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్లకుండా ఉండాలంటే ముందుగానే వారు మాట్లాడుకోవాలి. పిల్లలు ఒక వయసు వచ్చేవరకు ఇష్టయిష్టాలను పక్కన పెట్టుకోవాలని ఒక ఒప్పందానికి రావాలి. పిల్లలకు నడక వచ్చిన తర్వాత వారితో ఎంత దూర ప్రయాణాలు చేసినా ఆనందంగానే ఉంటుంది. అలాగే పిల్లలతో ఎంజాయ్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి. పిల్లలతో ఎంజాయ్ చేయడం నేర్చుకున్న జంటలు ఎక్కువ కాలం పాటు కలిసి ఉంటాయి. నిజానికి వారు విడిపోకుండా జీవితాంతం కలిసే జీవిస్తారు. కాబట్టి పిల్లలను అడ్డుగా లేదా బరువుగా భావించకుండా వారే జీవితంగా భావిస్తే ఏ భార్యాభర్తా విడిపోరు.

Share