భారతదేశంలో ఉద్యోగులు తీవ్రంగా ఒత్తిడి పెడుతున్నట్టు కొన్ని నివేదికలు చెప్పాయి. అతిగా పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి అలిసిపోతున్నారని… అవి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతున్నట్టు ఈ నివేదిక చెబుతోంది. ప్లమ్ కంపెనీ నివేదికలో నలభై ఏళ్ల వయసు వచ్చేసరికి ఎంతోమంది ఉద్యోగులు తీవ్రమైన వ్యాధులతో బాధపడడం ప్రారంభిస్తున్నట్టు చెబుతోంది.
ముఖ్యంగా మానసిక ఒత్తిడి కారణంగా 40 శాతం మంది ఉద్యోగులు ప్రతినెలా సెలవులు అడుగుతున్నారని కూడా వివరించింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఐదు మంది ఉద్యోగులలో ఒకరు బర్న్ అవుట్ కారణంగా ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారని తెలుస్తోంది.
ఏ వయసులో ఏ వ్యాధులు?
నివేదిక చెబుతున్న ప్రకారం ఒకప్పుడు 45 ఏళ్లు దాటితే గాని ఏ ఆరోగ్య సమస్యా కనిపించేది కాదు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాతే ప్రమాదకరమైన వ్యాధులు యువతలో మొదలవుతున్నట్టు డేటా చెబుతోంది. గుండె జబ్బులు వచ్చే వయసు 32 సంవత్సరాలకే తగ్గిపోయింది. అంటే 32 ఏళ్ళకే కొంత మందిలో గుండె సమస్యలు ప్రారంభమవుతున్నాయి. ఇక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు 33 ఏళ్లకే ఎక్కువ మందిలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక డయాబెటిస్ 34 ఏళ్లకు ప్రారంభమవుతుంది. కిడ్నీ వంటి తీవ్రమైన కిడ్నీ వ్యాధులు 35 ఏళ్ల వయసులో వస్తున్నాయి. మెదడు సమస్యలు మెదడు స్ట్రోక్ వంటివి 36 ఏళ్ల వయసులో ప్రారంభమవుతున్నాయని నివేదిక వివరిస్తోంది.
ఇలా చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్యాల బారిన పడటం వల్ల యువత ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. ఇది వారి వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. వారి పని సామర్థ్యం కూడా తీవ్రంగా తగ్గిపోతుంది. ఇది దేశ ఆర్థిక పురోగతిపై కూడా నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగులు అనారోగ్యాల బారిన పడుతూ ఉంటే ఆ కంపెనీలకు భారీ నష్టాలు రావడం ఖాయం. ప్రతి సంవత్సరం ఉద్యోగులు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు 30 రోజులపాటు పనిని కోల్పోతున్నట్టు కూడా అధ్యయనాలు చెబుతున్నాయి.
కంపెనీలు ఉద్యోగి అనారోగ్యానికి గురైనప్పుడు సెలవులు ఇవ్వడం లేదా చికిత్స సౌకర్యాలను అందించడం కన్నా ముందుగానే వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధులు రాకముందే వాటిని నివారించడంపై దృష్టి పెడితే ఉద్యోగులు, సంస్థలు తద్వారా దేశం కూడా పరిణతి చెందుతుంది.
ఉద్యోగులు పని ఒత్తిడిలో పడి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని వల్లే ఒక్కసారిగా వారు బర్న్ అవుట్ అవుతున్నారు. ఉద్యోగం చేయలేని పరిస్థితికి వస్తున్నారు.
ఉద్యోగాలు చేస్తున్న యువతలో మానసిక ఆరోగ్య సమస్యలే అధికంగా ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ముఖ్యంగా డిప్రెషన్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 30 నుండి 49 సంవత్సరాల వయసు గల ఉద్యోగులలో డిప్రెషన్ బారిన ఎక్కువమంది పడుతున్నారు.
కాబట్టి ఆరోగ్యాన్ని దిగజార్చుకోవడానికి ముందే జాగ్రత్త పడి పని ఒత్తిడిని తగ్గించుకొని, ధ్యానం, యోగా వంటివి మొదలుపెట్టాలి. ముందుగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మానసిక ఆరోగ్యం ఎన్నో శారీరక సమస్యలకు కారణం అవుతుంది.