Corona virus: దేశంలో కరోనా మళ్లీ విభృంభిస్తోందా? రోజురోజుకూ పెరుగుతున్న కేసుల పరిస్థితి ఏంటి? దీనిపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి? వ్యాక్సిన్ తీసుకున్నా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనేది అసలు ప్రశ్న? వ్యాక్సిన్ కు సమయం ముగిసిపోయిందా? అందుకే కేసులు పెరుగుతున్నాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 3,400కి చేరింది. ఈ మహమ్మారి భారిన పడి ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు. కరోనాతోపాటు ఇతర వ్యాధులు ఉండటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయన్నది అధికారుల మాట. జనవరి నుంచి ఇప్పటివరకు దీనివల్ల 26 మంది మృత్యువాతపడ్డారు.
మహారాష్ట్ర-7, కేరళ-6, ఢిల్లీ-3, కర్ణాటక-3, ఉత్తరప్రదేశ్ ఇద్దరు చొప్పున చనిపోయారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మే 19 నాటికి దేశంలో 257 మాత్రమే ఉన్నాయి. తక్కువ సమయంలో అమాంతంగా కేసులు పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం.
ఏపీలో కేసుల సంఖ్య 17కి చేరింది. కొత్తగా విశాఖపట్నంలో మూడు కేసులు, రాయలసీమలో ఒక కేసు నమోదైంది. ఏలూరు కలెక్టరేట్లో నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో మూడు కేసులు ఉన్నాయి. హైదరాబాద్లో ఒక పల్మనాలజిస్ట్ ఈ మహమ్మారి బారినపడ్డారు. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ALSO READ: బంగాళాదుంప మసాలా ఇలా పావుగంటలో చేయండి..
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఆరు రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిలో కేరళలో 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో మహారాష్ట్ర 209 కేసులతో టాప్లో ఉంది. ఢిల్లీ (104) సెకండ్ ప్లేస్ కాగా, గుజరాత్(83) మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కర్ణాటక (47), తమిళనాడు(69) రాష్ట్రాలున్నాయి. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చెయ్యడానికి ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాయి రాష్ట్ర ప్రభుత్వాలు.
వ్యాధులున్నవారికి టెస్టులు చేస్తే కేసులు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు. కరోనా విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలు మాస్క్లు ధరించడం, రద్దీ ప్రదేశాలను వెళ్లక పోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది నిపుణుల మాట.
దేశంలో JN.1 వేరియంట్ కేసులు 53 శాతంగా నమోదు అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత BA.2 రకం 26 శాతం కేసులు, NB.1.8.1, LF.7 వేరియంట్లు సైతం ఉన్నాయి. వీటిలో NB.1.8.1 తమిళనాడు, LF.7 గుజరాత్లో కేసులు నమోదయ్యాయి. ఆయా వేరియంట్లు శరీరంలోని రోగ నిరోధక శక్తిని ఎదుర్కోగలుగుతున్నాయని అంటున్నారు. వీటివల్ల తీవ్రమైన అనారోగ్యం రావడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR తెలియజేసింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఆసియా దేశాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. చైనా, సింగపూర్, హాంకాంగ్లలో ఎక్కువగా ఉన్నాయి. NB.1.8.1, LF.7 వేరియంటు పెరుగుదలకు కారణంగా వివిధ దేశాలు చెబుతున్నాయి. ప్రపంచంలో కరోనా పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
కొత్త వేరియంట్లపై మానటరింగ్ చేస్తున్నామని, అవి ప్రాణాంతకమైనవా కాదా అనేది అప్పుడే తెలియదని అంటోంది. ఈ వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయని, తీవ్రమైన అనారోగ్యం రావట్లేదని చెబుతోంది. మరణాలు తక్కువే అన్నది WHO మాట.