Burning feet at night: రోజంతా కష్టపడి పని చేసి,రాత్రి హాయిగా నిద్ర పోదామని అనుకునే సరికే పాదాల్లో.. మంటలు మొదలవుతున్నాయా? సూదులతో గుచ్చినట్లు లేదా నిప్పులపై నడుస్తున్నట్లు అనిపిస్తుందా? ఈ సమస్యను అస్సలు తక్కువగా అంచనా వేయకండి. పాదాల మంటలు కేవలం ఒక ఇబ్బంది మాత్రమే కాదు. అది మీ శరీరంలో దాగి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. ఈ మంటల నుంచి ఉపశమనం పొందడానికి, హాయిగా నిద్ర పోవడానికి ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పాదాల మంటలు లేదా ‘బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్’అనేది చాలా మందిలో.. కనిపించే సమస్య. ముఖ్యంగా రాత్రిపూట ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉండొచ్చు. విటమిన్ లోపం నుంచి డయాబెటిస్ వరకు ఏదైనా కారణం కావచ్చు.
పాదాల మంటలకు ప్రధాన కారణాలు:
డయాబెటిక్ న్యూరోపతి: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే నరాలు దెబ్బతింటాయి. దీని వల్ల పాదాల్లో మంటలు వస్తాయి.
విటమిన్ లోపం: ముఖ్యంగా విటమిన్ B12, B6, ఫోలేట్ లోపం వల్ల నరాల పనితీరు మందగించి మంటలు పుడతాయి.
పాదాల ఇన్ఫెక్షన్:’అథ్లెట్స్ ఫుట్’ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా పాదాల్లో మంట, దురద వస్తుంది.
అధిక బరువు: శరీరం బరువు ఎక్కువగా ఉన్నా లేదా రోజంతా నిలబడి పని చేసినా.. పాదాల మీద ఒత్తిడి పడి రాత్రిపూట మంటలు రావచ్చు.
తక్షణ ఉపశమనం కోసం 5 అద్భుతమైన చిట్కాలు:
1. చల్లని నీటి చికిత్స:
మంటలు మొదలవ్వగానే.. పాదాలను చల్లని నీటిలో 15 నిమిషాల పాటు ఉంచండి. ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి, నరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. అయితే.. మరీ ఐస్ వాటర్ వాడకూడదు. ఇది రివర్స్ రియాక్షన్ ఇచ్చే ప్రమాదం ఉంది.
2. యాపిల్ సైడర్ వెనిగర్ :
ఒక టబ్ గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి పాదాలను నానబెట్టండి. పాదాల్లో పి.హెచ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి, బ్యాక్టీరియాను తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది. ఇది మంటను తగ్గించడంలో అద్భుతమైన ఇంటి వైద్యం.
3. ఎప్సమ్ సాల్ట్ స్నానం:
ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది కండరాల నొప్పులు, నరాల మంటను తగ్గిస్తుంది. రాత్రి పడుకునే.. ముందు ఒక టబ్ నీటిలో ఎప్సమ్ సాల్ట్ కలిపి పాదాలను కాసేపు అందులో ఉంచితే హాయిగా నిద్ర పడుతుంది.
4. సహజ నూనెల మసాజ్:
కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో కొంచెం టీ ట్రీ ఆయిల్ లేదా పుదీనా నూనె కలిపి పాదాలకు మెల్లగా మసాజ్ చేయండి. పుదీనా నూనెలోని మెంతి గుణాలు పాదాలకు చల్లదనాన్ని ఇస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
5. ఆహారంలో మార్పులు:
మంటలు శాశ్వతంగా తగ్గాలంటే.. మీ ఆహారంలో విటమిన్ B12 ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, గుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లి పాదాల మంట తగ్గుతుంది.
ఈ చిట్కాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. ఒకవేళ మీకు నిరంతరం పాదాల మంటలు వస్తున్నట్లయితే.. వెంటనే డాక్టర్ సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం బెస్ట్. మంటలు తగ్గడానికి సరైన చెప్పులు వాడటం, పాదాల పరిశుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యం.