First Cement Less Stone House: ‘గత కాలము మేలు వచ్చు కాలం కంటెన్’ అంటూ పెద్ద వాళ్లు రాబోయే రోజుల గురించి ముందుగానే అంచనా వేసి చెప్పిన అద్భుతమైన మాట. అప్పుడప్పుడు నలుగురితో కలిసి మాట్లాడే సందర్భంలో పూర్వం రోజులు నయం అంటుండేవారు. ఏటువంటి టెక్నాలజీ లేకపోయినా, ఎన్నో అద్భుతాలు సృష్టించారు. బండరాళ్లను శిల్పాలుగా చెక్కి, కళ్లు చెదిరే ఆలయాలను నిర్మించారు. సిమెంట్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే.. ఒకరాయిపై మరొక రాయిని పేర్చుతూ కళాఖండాలను ఆవిష్కరించారు. ఆ రోజుల్లో ఆలయాల నిర్మాణానికి ఉపయోగించిన టెక్నిక్స్ ఈ రోజు ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తే? సిమెంట్ లేకుండా కేవలం రాళ్లతోనే ఇళ్లు కడితే? వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అవును.. అచ్చంగా ఇదే టెక్నిక్ ఉపయోగించి బెంగళూరులో అద్భుతమైన ఇల్లు నిర్మించారు. వెయ్యేళ్ల పాటు చెక్కు చెదరకుండా తీర్చిదిద్దారు. ఈ అద్భుతమైన ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రపంచంలోనే తొలి జీరో-సిమెంట్ స్టోన్ హౌస్
బెంగళూరులో నిర్మించిన ఈ జీరో సిమెంట్ స్టోన్ హౌస్ కు సంబంధించిన వీడియోను.. కంటెంట్ క్రియేటర్ ప్రియమ్ సరస్వత్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రపంచంలోనే తొలి జీరో సిమంట్ స్టోన్ హౌస్ అంటూ దీని యజమాని పరిచయం చేశాడు. ఇంటి యజమానితో పాటు ఆర్కిటెక్.. ఈ స్టోన్ హౌస్ కు సంబంధించిన వివరాలను వెల్లడించే ప్రయత్నం చేశారు.
1,000 ఏండ్లకు పైగా చెక్కు చెదరకుండా నిర్మాణం
సిమెంట్ తో నిర్మించిన ఇళ్లు కేవలం 50 ఏండ్ల వరకు ఉంటుందని, ఈ రాతి ఇల్లు 1,000 ఏండ్ల పాటు ఏమాత్రం చెక్కు చెదరదని వెల్లడించారు. ఈ ఇంటిని గ్రే కలర్ గ్రానైట్, ఇసుక రాయితో పాటు పలు రకాల స్టోన్స్ ఉపయోగించి నిర్మించినట్లు తెలిపారు. సాంప్రదాయ నిర్మాణ పద్ధతుల మాదిరిగా కాకుండా, పురాతన కాలంలో ఆలయాల నిర్మాణంలో ఉపయోగించిన పద్దతులను పాటించినట్లు చెప్పారు. ఇంటర్ లాకింగ్ పద్దతుల ద్వారా ఈ ఇంటిని నిర్మించినట్లు వెల్లడించారు. అంతేకాదు, ఈ ఇంటి నిర్మాణానికి బ్లాస్టింగ్ గ్రానైట్ కాకుండా, కటింగ్ గ్రానైట్ ను ఉపయోగించినట్లు తెలిపారు. కర్బన ఉద్గారాలను వెదజల్లే ఎలాంటి పదార్థాలను ఈ ఇంటి నిర్మాణంలో ఉపయోగించలేదన్నారు. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి పేటెంట్ రైట్స్ తీసుకోవాలని భావిస్తున్నట్లు యజమాని తెలిపారు. ఈ ఇల్లు ఎంత విస్తీర్ణంలో నిర్మించారు? ఎంత ఖర్చు అయ్యింది? అనే విషయాలను ఇందులో వివరించలేదు. కానీ, ఈ అద్భుతమైన కళాఖండం నిర్మాణానికి సుమారు రూ. 25 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ప్రియమ్ సరస్వత్ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది. కొంత మంది ఈ ఇంటి నిర్మాణంపై ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొంత మంది అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. “ఇది నిజంగా అద్భుతం! ప్రాచీన భారతీయ వాస్తుశిల్ప పద్దతులను ఉపయోగించిన గొప్పగా నిర్మించారు. ఈ ఇల్లు ఆధునిక పునరుజ్జీవనంలా అనిపిస్తుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “దశాబ్దాలుగా దేవాలయాలను ఇంటర్ లాకింగ్ పద్దతులను ఉపయోగించి నిర్మిస్తున్నారు. దీనికి పేటెంట్ ఎలా పొందుతారు?” అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. “ఈ ఇల్లు తీవ్రమైన ఎండ, చలి కాలాల్లో ఎలా ఉంటుంది?” అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో బోలెడు వ్యూస్ సాధించింది. వేలకొద్ది లైకులు, షేర్ లు సాధించింది.
Read Also: ఆస్తులు ఉండగానే సరిపోదు, సావిత్రమ్మ లాంటి దాణగుణం ఉండాలి!