Winter Vegetables: శీతాకాలంలో మనం రోజూ తినే కూరగాయలను ఆచితూచి ఎంచుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ సీజన్లో లభించే కూరగాయలు అన్నిటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తోడ్పడుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తుంటాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే.. శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీని కోసం కచ్చితంగా తినాల్సిన కొన్ని కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శీతాకాలంలో తరచూ క్యారెట్ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. క్యారెట్లు నారింజ రంగు బీటా-కెరోటిన్ను కలిగి ఉండటం వలన ఇది శరీరంలో విటమిన్ ‘ఏ’ గా పనిచేస్తుంది. ఈ బీటా-కెరోటిన్ కంటి చూపుకు అమృతంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ క్యారెట్ తింటే.. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. క్యారెట్స్లో ఫైబర్ కూడా అధికం. కాబట్టి.. ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది.
అన్ని కాలాల్లోనూ బీట్రూట్ అందుబాటులో ఉంటుంది. దీని నుంచి అద్భుతమైన ఐరన్ పొందవచ్చు. రక్తహీనతతో పోరాడటంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బీట్రూట్లో నైట్రేట్లు కూడా ఉండటంతో.. ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. దీని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలంగా మారుస్తాయి.
Read Also: మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా.. మన బొడ్డులో పేరుకుపోయిన ఈ మెత్తటి పదార్థం ఏంటని?
నిజానికి టర్నిప్ను తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ, దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గుతో పోరాడటానికి తోడ్పడుతాయి. అంతేకాదు.. టర్నిప్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో హెల్పవుతాయి. టర్నిప్లలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
వింటర్ సీజన్లో మార్కెట్లో విరివిగా లభించే పాలకూర ఆరోగ్యానికి ఒక వరం. దీనిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఏ, సి, కె వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను కూడా నిర్వహిస్తుంది.
మెంతులు సాధారణంగా అనిపించినా.. వీటిలో పోషకాలు అనేకం. మెంతులు రుచిలో చేదుగా ఉన్నా.. జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. కాబట్టి.. డయాబెటిస్ ఉన్నవాళ్లకి మెంతులు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా ఇనుము, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
Read Also: మొలకెత్తిన దుంపలు తింటున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!