ఒంటరితనం కొంతమందికి మానసిక ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటారు. కానీ అది మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఒకేసారి ప్రభావితం చేస్తుంది. ఇది మీ భావాలను, ఆలోచనలను దెబ్బతీస్తుంది. మీ శారీరక ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. ఒంటరిగా జీవించే వారికి అతి త్వరగా డయాబెటిస్ వ్యాధి వచ్చేస్తుందని కొత్త అధ్యయనం తేల్చింది.
సామాజికంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులు డయాబెటిస్ బారిన అతి త్వరగా పడుతున్నట్టు కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అధ్యయనం తెలిపింది. కోవిడ్ 19 మహమ్మారి వచ్చాక సామాజికంగా ఒంటరిగా జీవిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా వృద్ధులు, పెళ్లికి దూరంగా ఉన్న వ్యక్తులు ఇలా ఒంటరిగా జీవిస్తున్నారు.
నిశ్శబ్ద హంతకుడు
మధుమేహం, రక్తంలో అధిక చక్కెర స్థాయిలతో ఒంటరితనం ముడిపడి ఉన్నట్టు తాజా అధ్యయనం చెబుతోంది. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను సమర్ధవంతంగా వినియోగించుకోలేనప్పుడు వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఇలా పెరిగితే గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, దృష్టి సమస్యలు వంటివి వస్తాయి. అందుకే డయాబెటిస్ ని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే నిశ్శబ్ద హంతకుడిగా పిలుచుకునే అధిక రక్తపోటుకు డయాబెటిస్ కు మధ్య దగ్గర సంబంధం ఉంది. అధిక రక్తపోటు ఉన్న వారిలో కూడా మధుమేహం త్వరగా వచ్చేస్తుంది.
ఒంటరిగా జీవిస్తే డయాబెటిస్
సామాజికంగా ఒంటరిగా జీవించడం అంటే సమాజంలో కలవకుండా, స్నేహితులు లేకుండా తన ఇంట్లో తన పనులు తానే చేసుకుంటూ ఉండడం. ఉద్యోగానికి వెళ్లినా అక్కడ కూడా స్నేహితులు లేకుండా తన పని తను చేసుకొని ఇంటికి వచ్చేయడం. ఇలా ఒంటరిగా ఇతరులతో కలవకుండా జీవించడమే ఒంటరితనం. అలాగే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఇంటా, బయట ఎప్పుడూ ఒంటరిగా ఉండే వ్యక్తులకు డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
ఒంటరితనానికి, మధుమేహానికి మధ్య అనుబంధాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నో ఏళ్లుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరింత విశ్లేషాత్మకంగా తెలియజెప్పింది.
ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఒంటరిగా జీవిస్తారో వాళ్ళకే డయాబెటిస్ వచ్చే అవకాశం 34 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎవరైతే కుటుంబంతో కలిసి సమాజంలో స్నేహితులతో కలిసిమెలిసి జీవిస్తారో వారికి డయాబెటిస్ అదుపులో ఉన్నట్టు అధ్యయనం చెప్పింది.
ఈ అధ్యయనంలో భాగంగా 60 ఏళ్ల నుండి 84 సంవత్సరాల మధ్య గల నాలుగువేల మంది వృద్ధుల డేటాను పరిశీలించారు. వారిలో సామాజికంగా ఒంటరిగా జీవిస్తున్న వారు కుటుంబంతో స్నేహితులతో కలిసి జీవిస్తున్న వారు ఉన్నారు. కుటుంబంతో కలిసి జీవిస్తున్న వారితో పోలిస్తే ఒంటరిగా వృద్ధులలో మధుమేహం సమస్య అధికంగా ఉన్నట్టు తెలిసింది.