Bollywood: కథ, కథనం బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు. అలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు.. ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు మరో చిత్రానికి లభిస్తున్న ప్రేక్షక ఆదరణ చూసి, ఆ చిత్ర దర్శకుడు ఎమోషనల్ అవుతూ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు హైదరాబాదు వాసులతో ప్రత్యేకంగా ముచ్చటించి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆయన ఎవరో కాదు ఇంతియాజ్ అలీ..
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో దిల్జిత్ దోసాంజ్, శర్వరి, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ భావోద్వేగ ప్రేమ కథా చిత్రం ఇది. 1947 దేశ విభజన జ్ఞాపకాలు , తొలిప్రేమ నేపథ్యంలో సాగిన ఈ కథకి ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.. ఈ సినిమా విడుదలై ఆరు వారాలవుతున్నా.. ఇంకా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇండియాలో 450 కి పైగా షోలతో పాటు విదేశాలలోని 10 దేశాలలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది ఈ చిత్రం.
ALSO READ:గబ్బర్ సింగ్ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమంటున్న వైద్యులు!
అందులో భాగంగానే ఈ ఏడాది హిందీ చిత్రాలలో అత్యంత భారీ విదేశీ విడుదలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. సుమారుగా 59 దేశాలలో 804 స్క్రీన్ లపై విడుదలైంది. హిందీ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, కలకత్తా, బెంగళూరు వంటి నగరాలలో కూడా ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. సినిమాకి వస్తున్న అద్భుతమైన స్పందన చూసిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ప్రత్యేకంగా హైదరాబాద్ కి వచ్చి ప్రేక్షకులను కలుసుకున్నారు.
తమ సినిమాను ఇంతగా ఆదరించి, విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఇంతియాజ్ అలీ.. తాజాగా ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ చిత్రానికి లభిస్తున్న ప్రేమకు హర్షం వ్యక్తం చేశారు. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా.. ఆ తర్వాత ప్రేక్షకుల నోటి మాట ప్రచారంతో ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా.. భావోద్వేగ కథ , అద్భుత నటన, హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
ఇకపోతే హైదరాబాద్ పర్యటనలో భాగంగా అభిమానులతో మాట్లాడిన ఆయన.. వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని బిర్లా స్టూడియోస్, అప్లాస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి మోహిత్ చౌదరి , శిబాసిష్ సర్కార్ నిర్మించిన ఈ చిత్రాన్ని బిర్లా స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తానికి అయితే ఈ చిత్రం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితం అవుతూ.. ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్న చిత్రాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.