Jagapathi Babu: రామ్ చరణ్…RRR సినిమాతో గ్లోబల్ వైడ్గా సత్తా చాటిన ఈ మెగా పవర్ స్టార్ ‘గేమ్ చేంజర్’తో డీలా పడ్డ సంగతి తెల్సిందే. ఇక ఈ క్రమంలో సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తానంటూ బుచ్చిబాబుతో పెద్దిని పట్టాలెక్కించాడు.ఇక జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద 230 కోట్లపై చిలుకు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ట్రేడ్ వర్గాలకి సైతం షాక్ ఇస్తున్న ఈ సినిమా సక్సెస్ ఒక ఎత్తయితే, ఇందులో ‘అప్పలసూరి’ అనే పవర్ఫుల్ పాత్రలో నటించిన సీనియర్ నటుడు జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
సాధారణంగా ఏ సినిమాకైనా వసూళ్లు రావడం ముఖ్యం, కానీ జగపతిబాబు వెల్లడించిన నిజాలు చూస్తే ఒక సినిమా వెనుక నటీనటులు ఎంతగా ప్రాణం పెడతారో అర్థమవుతుంది. గతంలో ‘రంగస్థలం’,’అరవింద సమేత’ వంటి చిత్రాల్లో తన విలక్షణ నటనతో మెప్పించిన జగ్గుభాయ్, ఈ సినిమా కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. “రూ.300 కోట్లు పెట్టి సినిమా తీసినా.. రూ.300 పెట్టి థియేటర్కు వచ్చి చూసే ఆడియన్స్ చేతుల్లోనే ఇండస్ట్రీ తలరాత ఉంటుంది” అంటూ ఆయన చెసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
also read :జాన్వీ ఇన్స్టా చాట్ లీక్.. ఆ సీన్లపై అసహనం, బుచ్చిబాబుపై గుర్రు, చెర్రీ గురించి కూడా!
ఈ ప్రాజెక్ట్పై తాను ఎంతో ప్రాణం పెట్టి పనిచేశానని, మధ్యలో తాను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. ‘పెద్ది’ విడుదల కోసమే అత్యంత ఆసక్తిగా ఎదురుచూశానని ఆయన ఎమోషనల్ అయ్యారు. సినిమా రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనకు ఫోన్ చేసి, “ఇంత గొప్ప పాత్ర చేసినా మిమ్మల్ని ఎందుకు ఎవరూ గుర్తించడం లేదు? అదే పరభాష నటులు ఈ క్యారెక్టర్ చేసి ఉంటే మరో 20 ఆఫర్లు వచ్చేవి” అని అన్నట్లు జగపతిబాబు గుర్తుచేసుకున్నారు. ఏ పరిశ్రమలోనైనా పరభాష నటులకు ఎక్కువ గౌరవం దక్కుతుందని, గతంలో తాను కన్నడలో ‘రాబర్ట్’ లాంటి చిత్రాలు చేసినప్పుడు అక్కడ తనకు లభించిన మర్యాదను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
“ఈ సినిమా కోసం నేను నా ప్రాణాన్ని ధారపోశాను. అందుకే గుర్తింపు కోసం అడిగే హక్కు నాకు ఉంది. మిగతా చిత్రాలకు నేనెప్పుడూ ఇలా అడగలేదు. షూటింగ్ సమయంలో ప్రతి షాట్కు చప్పట్లు కొట్టిన మూవీ టీమ్ ఇప్పుడు థియేటర్లలో రెస్పాన్స్ వచ్చాక నా గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని డైరెక్టర్ బుచ్చిబాబును కూడా సరదాగా ప్రశ్నించాను. ఈ సినిమాకు ఇంకా పెద్ద ఎత్తున గుర్తింపు దక్కాలి, కచ్చితంగా దక్కుతుంది.”అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో చిత్ర హీరోయిన్ జాన్వీ కపూర్పై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్పై జగపతిబాబు చాలా ఘాటుగా స్పందించారు. ఇటీవల ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బాలీవుడ్ బ్యూటీ, ‘పెద్ది’లో తన నటన విషయంలో కొంత నెగెటివిటీని ఎదుర్కొంటోంది. దీనిపై జగ్గుభాయ్ స్పందిస్తూ.. నటన విషయంలో ఆర్టిస్టులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని గట్టిగా రిక్వెస్ట్ చేశారు. పాపం ఆ అమ్మాయి దర్శకుడు చెప్పినట్లుగా తన పాత్రకు న్యాయం చేసిందని, కొన్నిసార్లు బాగుంది అనుకున్నది స్క్రీన్పై మిస్ఫైర్ అవ్వొచ్చని చెప్పారు. అంతమాత్రానికే తనను మానసికంగా ఇబ్బంది పెట్టేలా ట్రోల్ చేయడం సరికాదని, ఈ విషయంలో తాను పూర్తిగా జాన్వీ కపూర్కు సపోర్ట్ చేస్తానని వెల్లడించి తన పెద్దరికాన్ని చాటుకున్నారు.
also read :ఫ్యాన్స్కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!