Jayaprada Interview: దశాబ్దాల కాలం పాటు వెండితెరను ఏలిన అందాల నటి, మాజీ ఎంపీ జయప్రద గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన విషయాలను పంచుకున్నారు. గ్లామర్ ప్రపంచంలో తారగా వెలుగు వెలిగినా, ఆమె వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగిందని ఈ సంభాషణ ద్వారా స్పష్టమైంది.
జయప్రద గారి సినీ ప్రయాణం ఒక అద్భుతం. బాపు దర్శకత్వంలో ఆమె సినిమా రంగ ప్రవేశం చేశారు. “బాపు గారి సీత వచ్చింది” అని అందరూ అనుకునేలా తనను మలిచారని ఆమె గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా, సీత పాత్రలో ఒదిగిపోవడానికి కళ్ళు ఎలా దించాలి, తల ఎత్తకుండా ఎలా నడవాలి అనే విషయాల్లో బాపు గారు తనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని ఆమె తెలిపారు.
Read also-Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి సీరియస్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అప్పట్లో జయప్రద, శ్రీదేవిల మధ్య ఉన్న వృత్తిపరమైన పోటీ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఆ పోటీ ఒక్కోసారి భయంకరంగా ఉండేదని ఆమె చెప్పారు. “ఎయిర్పోర్ట్లో నన్ను చూసి కూడా ‘అదిగో శ్రీదేవి వెళ్తోంది’ అనేవారు. వాళ్లకు జయప్రద ఎవరో, శ్రీదేవి ఎవరో కూడా తెలిసేది కాదు.” కోల్కతా వంటి నగరాల్లో తమ ఇద్దరి అభిమానుల మధ్య ఘర్షణలు జరిగి, ఒకరినొకరు పొడుచుకుని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, శ్రీదేవి ఇప్పుడు లేకపోవడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని, ఆమెను చాలా మిస్ అవుతున్నానని ఎమోషనల్ అయ్యారు.
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్తో ఆమెకున్న అనుబంధం గురించి చెబుతూ, ‘షరాబీ’ సినిమా షూటింగ్ సమయంలో ఒక అపరిచిత వ్యక్తి తనను వేధిస్తుంటే, అమితాబ్ స్వయంగా వచ్చి తనను రక్షించి మేకప్ రూమ్లో వదిలారని ఒకనాటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు.
Read also-Podarillu Today Episode : బ్యానర్ చూసి మహా షాక్.. చక్రీ పై మహా సీరియస్.. కేశవ, చక్రీ మధ్య గొడవ..
“మీ జీవితంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏది?” అని అడిగిన ప్రశ్నకు జయప్రద గారు ఏమాత్రం తడబడకుండా “నా పెళ్లి” అని సమాధానమిచ్చారు. సినీ సెలబ్రిటీగా ఉండటం ఒక రకమైన శాపమని, వ్యక్తిగత జీవితంలో సుఖం కంటే అభద్రతా భావమే ఎక్కువగా ఉండేదని ఆమె వాపోయారు. తనపై యాసిడ్ దాడి జరుగుతుందేమోనన్న భయంతో, ప్రాణ భయంతో బతికిన రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు సిద్ధార్థ్ త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్నాడని జయప్రద ధృవీకరించారు. అతనికి సినిమా అంటే విపరీతమైన పట్టుదల అని, ఇప్పటికే పలు ఆఫర్లు వస్తున్నాయని చెప్పారు. అతను చూడటానికి బాలీవుడ్ హీరోలా ఉన్నప్పటికీ, ఒక తెలుగు వాడిగా ముందుగా తెలుగు ఇండస్ట్రీ నుంచే కెరీర్ ప్రారంభించాలన్నది తన కోరిక అని ఆమె వెల్లడించారు.