Prakash Raj Response: వివాదాస్పద ‘ధర్మస్థల మాస్ బరియల్ కేసు’ (ధర్మస్థల శ్మశానాల వివాదం) లో తనపై వస్తున్న ఆరోపణలను ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో సాగుతున్న దర్యాప్తుతో తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, కేవలం తాను మాట్లాడిన ఒక ఫోన్ కాల్ను కొందరు సందర్భోచితం కాకుండా (Out of context) వాడుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also-E20 ఫ్యూయల్ తో ఇంజిన్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా? పాత కారు ఓనర్లకు కొత్త టెన్షన్!
ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిన్నయ్య అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ… ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ప్రారంభించిన కొత్తలో చిన్నయ్య తనకు ఫోన్ చేశాడని తెలిపారు. ఆ సమయంలో అతడు తమిళం, తెలుగు భాషలు కలుపుతూ చాలా ఆందోళనగా, భయంతో మాట్లాడాడని గుర్తుచేశారు.
“ఆ ఫోన్ కాల్లో నేను అతనికి కేవలం ధైర్యం మాత్రమే చెప్పాను. నీ దగ్గర ఉన్నది నిజమే అయితే, భయపడకుండా దర్యాప్తు అధికారుల ముందుకు వెళ్లి నిజం చెప్పమని సూచించాను. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారి చాలా మంచివారు, నిజాయితీపరుడు.. కాబట్టి సత్యం బయటకు వస్తే అందరికీ మంచిదే అని అన్నాను” అని ప్రకాష్ రాజ్ వివరించారు. ఒక వ్యక్తిని నిజం వైపు నిలబడమని చెప్పడమే తప్ప, ఇందులో ఎలాంటి కుట్ర లేదని, దర్యాప్తును ప్రభావితం చేసే ఉద్దేశం తనకు అస్సలు లేదని ఆయన వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ను తాను ఇప్పటికే ఎస్ఐటి చీఫ్ ప్రణబ్ మొహంతికి కూడా అందజేసినట్లు పేర్కొన్నారు.
Read also-శర్వానంద్, శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. ‘జార్జ్ క్రిష్’గా సంక్రాంతి బరిలోకి చార్మింగ్ స్టార్!
చిన్నయ్య తన పిటిషన్లో… ప్రకాష్ రాజ్ మరియు కొందరు సామాజిక కార్యకర్తలు కలిసి ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి దాదాపు ₹200 కోట్ల నిధులతో కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నటుడు స్పందిస్తూ.. ఈ వ్యవహారానికి మత రంగు పులమవద్దని కోరారు. సమాజంలో జరిగే తప్పులను ప్రశ్నించడాన్ని లేదా అధికారుల నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడాన్ని మతంపై దాడిగా చిత్రీకరించడం సరికాదని ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా హితవు పలికారు.