Mangli : సింగర్ మంగ్లీ…పరిచయం అక్కర్లేని పేరు. జానపద గీతాలు పాడటంతో మొదలు పెట్టి స్వల్ప కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్టార్. అయితే, కొంతకాలంగా ఆమె వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ కు టార్గెట్ గా మారుతున్నారు. తాజాగా పెట్టుబడుల పేర నూటా యాభై మందికి నుంచి నూటా యాభై కోట్లకు పైగా డబ్బు తీసుకుని మోసం చేసినట్టుగా ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తనకెలాంటి సంబంధం లేదని మంగ్లీ చెబుతున్నా నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మంగ్లీ పుట్టింది ఎక్కడంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి తాండాకు చెందిన మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. నెల్లూరు దగ్గరలోని జీనిగల తాండాలో పెరిగిన ఆమె రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ సహకారంతో 10వ తరగతి పూర్తి చేశారు. ఆ తరువాత తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో కర్ణాటిక్ మ్యూజిక్ లో డిప్లొమా చదివారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చి జానపద గీతాలు పాడి కొంత గుర్తింపును పొందారు. అయితే, ఓ ఛానల్ లో ప్రసాదరమైన మాటకారి మంగ్లీ కార్యక్రమంలో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. తీన్మార్ మంగ్లీ కార్యక్రమంలో ఆమె యాస చూసి అంతా తెలంగాణ బిడ్డ అని అనుకున్నారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ అవకాశాలు సాధించుకున్న మంగ్లీ ప్రస్తుతం స్టార్ స్థాయికి ఎదిగారు. అమెరికాలో జరిగే అటా, తానా వేడుకల్లో ఆమె పాటలు పాడటం తప్పనిసరిగా మారింది.
బర్త్ డే పార్టీ వివాదం…
గత ఏడాది మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊర్లపల్లిలో ఉన్న త్రిపుర రిసార్ట్ లో పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో విదేశీ మద్యంతోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్నారని…చెవులు చిల్లులు పడేలా డీజేలు మోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో పార్టీలో పది మంది మహిళలతోపాటు పన్నెండు మంది పురుషులు దొరికారు. వీరికి డ్రగ్ టెస్టులు జరుపగా ఒక్క దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి పాజిటీవ్ వచ్చింది. అయితే, విచారణలో తాను బర్త్ డే పార్టీలో గంజాయి సేవించ లేదని, అంతకు ముందే మరో చోట తీసుకున్నా అని దామోదర్ రెడ్డి చెప్పాడు. అయితే, అనుమతులు తీసుకోకుండా మద్యం పార్టీ నిర్వహించటం, డీజేలు మోగించటంపై పర్మిషన్ తీసుకోకపోవటంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో ఓ వీడియో విడుదల చేసిన మంగ్లీ తన బర్త్ డే పార్టీలో ఎలాంటి మాదక ద్రవ్యాలు, విదేశీ మద్యం వినియోగం జరగలేదన్నారు. లోకల్ లిక్కర్ పార్టీకి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని చెప్పారు. తెలిసి ఉంటే తీసుకునే దాన్నని వివరణ ఇచ్చుకున్నారు.
also read:OTT Thriller: క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. మలయాళీ ‘డైమండ్’ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో!
పాట వివాదం…
ధృవ్ సర్జా నటించిన కేడీ..ది డెవిల్ చిత్రంలో మంగ్లీ పాడిన న సర్కే చునర్ ఏరీ సర్కే పాటపై కూడా తీవ్ర వివాదం చెలరేగింది. ఈ పాట సాహిత్యం…డ్యాన్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. డబుల్ మీనింగ్ పాట ఎలా పాడుతారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. దాంతో మరోసారి మంగ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలన్న ఉద్దేశ్యం తనకు లేదని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అనుకోకుండా జరిగిన పొరపాటు అని చెప్పి క్షమాపణలు కూడా తెలియచేశారు. మంగ్లీ పాడిన ఈ పాటపై సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయటం గమనార్హం.
తాజాగా పెట్టుబడుల వివాదం…
తాజాగా పెట్టుబడుల పేర పలువురి నుంచి 150 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్టుగా ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంగ్లీ తన సోదరుడు శివ, రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ తదితరులతో కలిసి అధిక వడ్డీ ఆశ చూపించి పలువురి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకున్నట్టుగా న్యాయవాది సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో పబ్బు నడుపుతున్నామని, అచ్చంపేటలో స్కూల్ ఉందని, మిర్యాలగూడలో ఆస్పత్రి ఉందని చెప్పి వాటి అభివృద్ధికి పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని చెప్పి పలువురిని నిలువునా ముంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోకాపేటలోని మంగ్లీ నివాసంలోనే తాము డబ్బు చెల్లించామని కొందరు బాధితులు సైతం చెబుతుండటం గమనార్హం. మంగ్లీ ప్రాజెక్ట్ అని చెప్పటం వల్లనే తాము ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టామని వాళ్లు అంటున్నారు. అయితే, మంగ్లీ మాత్రం ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. నిజానికి సుబ్బారావు పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బు ఇవ్వకపోతే అప్రతిష్టపాలు చేస్తానని చెప్పి మరీ ఇలా చేస్తున్నారన్నారు. ఆదివారం సుబ్బారావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఏది ఏమైనా తన గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మంగ్లీ ఇలా వరుస వివాదాల్లో చిక్కుకుంటుండటం ప్రస్తుతం చర్చనీయంగా మారింది.