Mammootty:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి (Chiranjeevi ) , బాలకృష్ణ (Balakrishna), నాగార్జున (Nagarjuna) వెంకటేష్ (Venkatesh ) ఎలా అయితే సత్తా చాటుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారో.. అటు మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్ (Mohan Lal), మమ్ముట్టి (Mammootty) కూడా అదే రేంజిలో అలరిస్తున్నారు. ముఖ్యంగా మోహన్ లాల్ గురించి మమ్ముట్టి.. మమ్ముట్టి గురించి మోహన్ లా.. వీరిపై ఏవైనా వార్తలు వచ్చాయి అంటే వెంటనే స్పందిస్తారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మమ్ముట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ వార్తలు రావడంతో ఆ వార్తలన్నింటికీ ఒక్క పోస్టుతో చెక్ పెట్టారు ఆయన స్నేహితుడు ప్రముఖ స్టార్ హీరో మోహన్ లాల్.
ఒక ఫోటోతో రూమర్స్ కి చెక్ పెట్టిన మోహన్ లాల్
గత కొన్ని రోజులుగా మమ్ముట్టి ఆరోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా మమ్ముట్టి.. మోహన్ లాల్ కి ముద్దు పెడుతున్న ఒక క్యూట్ ఫోటోని మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలో మమ్ముట్టి చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నట్టు మనం చూడవచ్చు. ఈ ఫోటో వారి మధ్య ఉన్న స్నేహ బంధానికి కూడా నిదర్శనంగా నిలిచింది అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్పకనే చెప్పేశారు మోహన్ లాల్.
అనారోగ్యంతో బాధపడుతున్న మమ్ముట్టి..
అసలు విషయంలోకి వెళ్తే.. మమ్ముట్టి ఆరోగ్యంపై గతంలో ఎన్నో రూమర్లు వచ్చాయి. ఆయన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా ఈ వార్తలు నిజమేనని చెప్పారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారని.. త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు అంటూ మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే వీటిని నిజం చేస్తూ.. మోహన్ లాల్ ఇలా ఫోటో షేర్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. అటు నిర్మాతలతో పాటు మంజు వారియర్ కూడా తన ఇన్స్టా లో ఈ ఫోటోని షేర్ చేయడమే కాకుండా “వెల్కం బ్యాక్ టైగర్” అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. మొత్తానికైతే అందరి ప్రార్థనలు ఫలించాయని, మమ్ముట్టి కోలుకున్నారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్నేహితుడి కోసం ప్రత్యేక పూజలు..
మలయాళం ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులుగా పేరు సొంతం చేసుకున్న మోహన్ లాల్ , మమ్ముట్టి తమ సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే మమ్ముట్టి పూర్తిగా కోలుకోవాలని.. ఈ ఏడాది మార్చిలో శబరిమలలో కూడా మోహన్ లాల్ పూజలు చేయించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి అని చెప్పడంతో కొంతమంది మోహన్ లాల్ ను తప్పుపట్టారు. అలా ఎలా పూజలు చేస్తారని ప్రశ్నించారు. దీంతో ఆయన మాట్లాడుతూ..” ఒక వ్యక్తి కోసం పూజలు చేస్తే తప్పేంటి? స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడు అందుకే చేయించాను” అంటూ క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే స్నేహానికి మతం, కులం, జాతి, వర్గం ఏవి అడ్డురావని మరొకసారి నిరూపించారు మోహన్ లాల్. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
also read:Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?