Oscar Nominated Movie:భారతదేశంలో ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రాజబ్’ సినిమా విడుదల నిలిపివేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా గాజాలో జరిగిన ఒక నిజ జీవిత ఘటనపై ఆధారపడి తెరకెక్కించారు. ఐదేళ్ల చిన్నారి హింద్ రాజబ్ మరణం ఈ చిత్రంలో ప్రధాన అంశంగా చూపించారు. ఈ కథ చాలా భావోద్వేగంగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఫ్రెంచ్-ట్యునీషియన్ దర్శకురాలు కౌతర్ బెన్ హానియా ఈ డాక్యూడ్రామాను.. తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికే అనేక దేశాల్లో విడుదలైంది. ఆస్కార్ అవార్డులకూ నామినేట్ కావడం దీని ప్రాధాన్యతను చూపిస్తుంది. అలాగే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో సిల్వర్ లయన్ అవార్డు కూడా గెలుచుకుంది.
అయితే.. భారత్లో మాత్రం ఈ సినిమాకు విడుదలకు అనుమతి ఇవ్వలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తే, భారత్-ఇజ్రాయెల్ సంబంధాలపై ప్రభావం పడవచ్చని అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై చిత్ర పంపిణీదారుడు మనోజ్ నంద్వానా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా, ఇజ్రాయెల్లో కూడా ఈ సినిమా ప్రదర్శించబడుతున్నప్పుడు, భారత్లో ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత సంవత్సరం కోల్కతాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. అంటే, పూర్తిగా నిషేధం కాకపోయినా, సాధారణ థియేటర్లలో విడుదలకు మాత్రం అడ్డంకులు ఎదురయ్యాయి.
ఈ విషయంపై రాజకీయంగా కూడా చర్చ మొదలైంది. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో సినిమాలు ప్రదర్శించడం స్వేచ్ఛకు ప్రతీక అని ఆయన అన్నారు. ఇతర దేశాల భావాలను దృష్టిలో పెట్టుకుని సినిమాలను నిషేధించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
ది వాయిస్ ఆఫ్ హింద్ రాజబ్సినిమా చుట్టూ వివాదం మరింత పెరుగుతోంది. ఒకవైపు భావోద్వేగ కథతో ప్రపంచాన్ని కదిలించిన ఈ చిత్రం, మరోవైపు రాజకీయ మరియు దౌత్య సంబంధాల కారణంగా భారత్లో విడుదల కాలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది సినిమాల స్వేచ్ఛ, ప్రభుత్వ నిర్ణయాలు, అంతర్జాతీయ సంబంధాల మధ్య ఉన్న సంబంధాన్ని మరోసారి ముందుకు తెచ్చింది.
ALSO READ: Mythri Movie Makers: మరో తమిళ చిత్రాన్ని ప్రకటించిన మైత్రీ బ్యానర్.. హీరో ఎవరంటే?