Tollywood:ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రత్యేకించి తమ సినిమాల కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్ కూడా ఒకరు . ముఖ్యంగా ఈయన తన సినిమాల కంటే కూడా సినిమా ఈవెంట్స్ లో, తన స్పీచ్ లతో రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. గీత ఆర్ట్స్ కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యి.. మెల్లిమెల్లిగా ఎదుగుతూ నేడు నిర్మాతగా మారారు. బేబీ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న ఎస్కేఎన్ ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇకపోతే ఈయన సినిమాలను నిర్మించడం ఒక ఎత్తైతే.. పలు సినిమా ఈవెంట్లలో చేసే కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలవడం మరో ఎత్తు. ముఖ్యంగా వైరల్ స్పీచ్ లు, వైరల్ కామెంట్స్ తో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అంతేకాదు సోషల్ మీడియాలో మీమార్స్ కంటెంట్ కూడా అయిపోయాడు ఎస్కేఎన్. అలా మీమర్స్ కి మంచి కంటెంట్ అందిస్తూ వైరల్ అవుతున్న ఈయన పుట్టినరోజు జూలై 7. అనగా రేపు తన పుట్టినరోజు కావడంతో నేడు మీడియా సమావేశంలో తన సినిమా గురించి మాట్లాడి.. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ:రివ్యూలపై మండిపడ్డ నిర్మాత.. పని గట్టుకొని మరీ బ్యాడ్ రివ్యూ!
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “ఇకపై నేను వైరల్ అవ్వాలని అనుకోవడం లేదు. మా బ్యాచ్ , మా ఫ్రెండ్స్ సినిమాలకు తప్ప బయట సినిమాల ప్రమోషన్స్ కి వెళ్లట్లేదు. నేను ఏదో మాట్లాడితే.. అది ఇంకోలా వైరల్ అవుతోంది. డిజిటల్ ప్రమోషన్స్ వాళ్లే ఒక్కోసారి ఇది మాట్లాడండి.. వైరల్ అవుతుంది.. సినిమాకి హెల్ప్ అవుతుంది అని కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా వాళ్లు అడిగారు కాబట్టే నేను మాట్లాడాను. కానీ ఒక్కసారి నేనే ఏదో ఒకటి నా రైమింగ్ లో మాట్లాడితే.. అది కూడా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో, మీడియాలో నా మాటలను కట్ చేసి వాళ్లకు ఏది కావాలో దాన్ని మాత్రమే హైలెట్ చేసుకుంటున్నారు. దీంతో నేను ఏం మాట్లాడుతున్నానో అనే విషయం పక్కకు వెళ్ళిపోతోంది. ఇది తెలియక చాలామంది నాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అందుకే ఇకపై నేను వైరల్ స్పీచ్ లు మాట్లాడాలని అనుకోవట్లేదు. కేవలం నా సినిమాలకు మాత్రమే నేను మాట్లాడుతాను. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది . మనం ఏం అనకపోయినా ఏదో ఒకటి హెడ్డింగ్ చూసి వీడు అనే ఉంటాడులే అని అందరూ అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి అవి నాపై బాగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేసే వాళ్లంతా నా ఫ్రెండ్స్ అనే అనుకుంటున్నాను. అందుకే ఇకపై అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా పూర్తిగా మాట్లాడడం తగ్గిస్తాను” అంటూ ఎస్ కే ఎన్ తెలిపారు. మొత్తానికైతే తన బర్త్డే సందర్భంగా ఎస్కేఎన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.