Indian Sailors: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నల్ల సముద్రంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో ఉక్రెయిన్లోని చోర్నోమార్స్క్ ఓడరేవులో పరిస్థితులు అత్యంత భయాందోళనకరంగా మారాయి. అక్కడి ఓడరేవులో నిలిచిపోయిన ‘ఎంవీ ఆమిర్ 1’అనే సరకు రవాణా నౌకలో 13 మంది భారతీయులు సహా మొత్తం 15 మంది నావికులు చిక్కుకుపోయారు. ఓడరేవు సమీపంలోనే నిరంతరం జరుగుతున్న క్షిపణులు, డ్రోన్ల దాడులతో అక్కడున్న సీమెన్లు తీవ్ర భయాందోళన నడుమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
క్షిపణి దాడుల భయం.. నౌకలోనే నావికులు
యుద్ధ వాతావరణం వల్ల ఓడరేవు ప్రాంతం యుద్ధ ప్రాంగణంగా మారింది. నౌకకు అతి సమీపంలోనే క్షిపణి దాడులు జరుగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని సిబ్బంది వణికిపోతున్నారు. ప్రాణ రక్షణ కోసం సాయం అందించే ప్రతినిధుల కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అక్కడ పరిస్థితులు ఏ క్షణంలోనైనా మరింత దిగజారే అవకాశం ఉండటంతో వెంటనే వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ మీటింగ్!
కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్ఎస్యూఐ విజ్ఞప్తి
ఈ క్లిష్ట సమయంలో చిక్కుకున్న భారతీయ నావికులను రక్షించేందుకు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తక్షణమే రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం, షిప్పింగ్ కంపెనీ, సంబంధిత ఇతర ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని ఎఫ్ఎస్యూఐ విజ్ఞప్తి చేసింది. నావికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించకపోతే వారి ప్రాణాలకే తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా స్పందించి, వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతానికి చేర్చాలని కోరింది.