Family Murder: రాజస్థాన్ జైపూర్లోని కర్ధాని ప్రాంతంలో అత్యంత ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 11) తెల్లవారుజామున ఒక వ్యక్తి తన భార్య, ముగ్గురు కుమార్తెలపై కిరాతకంగా బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. గోవింద్ వాటికలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని రాహుల్ ఝాగా గుర్తించారు. నిందితుడు తన భార్య గీతా ఝా (40), పెద్ద కుమార్తె నందిని (22), రెండో కుమార్తె రాధిక (17), చిన్న కుమార్తె గౌరి (14) లపై వారు నిద్రిస్తున్న సమయంలో దాడి చేశాడు. బండరాయితో తలపై తీవ్రంగా బాది చంపేశాడు. అనంతరం కింద పడ్డ రక్తపు మరకలను ఒక గుడ్డతో తుడిచేసి.. ఇంటి నుంచి పరారయ్యాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీసులు గోవింద్ వాటికలోని ఇంటికి చేరుకున్నారు. వేర్వేరు గదుల్లో పడి ఉన్న మృతదేహాలను గుర్తించారు. హత్యలు జరిగిన సమయంలో రాహుల్ తండ్రి లక్ష్మీనాథ్ ఝా ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని నమూనాలను సేకరించింది. హత్యకు ఉపయోగించిన రాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: పాత ఫోన్ నెంబర్ మార్చేశారా? తక్షణమే ఈ 4 పనులు చేయకపోతే రిస్కే!
ఘటనపై మీడియాతో మాట్లాడిన వెస్ట్ డిస్ట్రిక్ట్ DCP ప్రశాంత్ కిరణ్.. కుటుంబ కలహాల వల్లే ఈ ఘోరం జరిగినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న రాహుల్ ఝాను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో అతడి కోసం తనిఖీలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారితో మాట్లాడి గొడవకు గల కారణాలను ఆరా తీస్తున్నట్లు డీసీపీ వివరించారు.
Also Read: బంగ్లాదేశ్లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!