Big Stories

Joshimath : మరింత కుంగిన జోషిమఠ్‌.. మరి కొన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి..

Joshimath : ఉత్తరాఖండ్‌లో ప్రముఖ పర్యాటక క్షేత్రం జోషిమఠ్‌. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే అక్కడ భూమి కుంగిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ నివేదికలో భయాందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

2022 డిసెంబర్‌ 27 నుంచి 2023 జనవరి 8 మధ్య జోషిమఠ్ లో భూమి 5.4 సెంటీమీటర్లు కుంగినట్లు పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్‌-నవంబర్‌ మధ్యలో 9 సెంటీమీటర్ల మేరకు కుంగినట్లు గుర్తించారు. 2,180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్‌-అవులి రహదారిలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్లు ఈ ఉపగ్రహచిత్రాల్లో కనిపిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

- Advertisement -

ఉత్తరాఖండ్ లోని అనేక ప్రాంతాల్లో ఇవే పరిస్థితులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జోషిమఠ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏటా 2.5 అంగుళాల మేర భూమిలోకి దిగిపోతున్నట్లు డెహ్రాడూన్లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ నిర్ధారించింది. జులై 2020 నుంచి మార్చి 2022 వరకు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి.. లోయ ప్రదేశం మెల్లగా కుంగిపోతున్నట్లు తేల్చారు. జోషిమఠ్‌లో పరిస్థితికి ఎన్‌టీపీసీ ప్రాజెక్టు కారణమని అనుమానిస్తున్నారు. జోషిమఠ్‌ లాంటి పరిస్థితులే.. రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ, బాగేశ్వర్, టిహరి గఢవాల్, పౌరి ప్రాంతాల్లో ఉన్నాయి.

రుద్రప్రయాగ్‌
రిషికేశ్‌-కర్ణప్రయాగ్‌ రైల్వే లైన్‌ సొరంగ నిర్మాణంతో రుద్రప్రయాగ్ లోని మరోడ గ్రామంలో చాలా ఇళ్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా గ్రామస్థులను తరలించకపోతే పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

ఉత్తరకాశీ
ఉత్తరకాశీ సమీపంలోని మస్తాది, బట్వాడీ గ్రామాల్లో తరచూ కొండచరియలు విరిగి పడుతున్నాయి. మస్తాది గ్రామంలోని ఇళ్లు మెల్లగా కుంగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ సర్వేలు నిర్వహిస్తామని జిల్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారు తెలిపారు. ఈ సర్వే పూర్తయితే గానీ గ్రామస్థులకు పునరావాసం లభించదు.

బాగేశ్వర్‌
కోప్‌కోట్‌ వద్ద కర్‌బగ్డ్‌ గ్రామంలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ గ్రామంపై నిర్మించిన హైడ్రోపవర్‌ ప్రాజెక్టు టన్నెల్‌కు రంధ్రాలు పడి నీరు లీకవుతోంది. దీంతో ఈ గ్రామస్థులు జలప్రళయం ఎప్పుడొస్తుందో అని భయపడుతున్నారు. ఈ గ్రామం సమీపంలోనే రేవతి నది ప్రవహిస్తోంది.

టిహరి గఢవాల్‌
టిహరి జిల్లాలోని అటలి గ్రామం నుంచి రిషికేశ్‌-కర్ణప్రయాగ్‌ రైల్వే లైన్‌ వెళుతుంది. ఇక్కడ తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. చాలా ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఇక్కడ టన్నెల్‌ పనుల కోసం పేలుళ్లు చేపట్టడం కూడా సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

పౌరి
ప్రస్తుతం ఇక్కడ నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రిషికేశ్‌-కర్ణప్రయాగ్‌ రైల్వే లైన్‌ కోసం చేపట్టే పేలుళ్లే దీనికి కారణమని చెబుతున్నారు. పేలుళ్లను ఆపి సాధారణంగా పనులు చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తంమీద ఉత్తరాఖండ్ లో పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

For More Updates Follow Us —–>>>> https://bigtvlive.com/big-stories

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News