Centre To Launch Sahkar Taxi| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం వ్యాప్తంగా ‘సహకర్ ట్యాక్సీ’ పేరుతో ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది. ఉబెర్, ఓలా, బ్లూస్మార్ట్, రాపిడో వంటి పాపులర్ రైడింగ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా ఈ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హెం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రణాళికలను ప్రకటించారు. ఈ కార్యక్రమం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘సహకర్ సే సమృద్ధి’ (సహకారం ద్వారా శ్రేయస్సు) విధానానికి అనుగుణంగా ఉండబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ ప్రతిపాదిత సర్వీసు వల్ల ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించిన వివరాల ప్రకారం.. అధిక జనాభా ఉన్న దేశంలో విస్తారమైన మార్కెట్ కోసం అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించాలనుకుంటున్న సహకర్ ట్యాక్సీలో భాగంగా టూ వీలర్ టాక్సీ, రిక్షాలు, ఫోర్ వీలర్ టాక్సీ సేవలు అందించబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక, ప్రస్తుతం ఇలాంటి సర్వీసుల వల్ల సమకూరే లాభాలను ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాల మాదిరిగా కాకుండా, నేరుగా డ్రైవర్లకు చేరవేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read: చిన్న జ్యూస్ వ్యాపారికి రూ.7.7 కోట్ల ట్యాక్స్ నోటీస్.. ఆందోళన చెందుతున్న నిరుపేద
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు
పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఇలాంటి నమూనా అమలులో ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం ‘యాత్రి సతి’ అనే ప్రభుత్వ ట్యాక్సీ సర్వీస్ను గతంలోనే ప్రారంభించింది. మొదట్లో కోల్కతాలో ప్రవేశపెట్టిన ఈ సర్వీసు ఆ తరువాత సిలిగురి, అసన్సోల్, దుర్గాపూర్ సహా ఇతర నగరాలకు విస్తరించింది. యాత్రి సతి త్వరగా వినియోగదారులను తమ గమ్యాలకు చేరవేస్తుంది. లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ (బెంగాలీ లేదా ఇంగ్లీష్)తో సరసమైన ఛార్జీలు, 24/7 కస్టమర్ సపోర్ట్ను అందిస్తుంది. కర్ణాటకలో ‘నమ్మ యాత్రి’ అనే ప్రైవేట్ యాజమాన్యంలోని టాక్సీ సేవల యాప్ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత నమూనాను అనుసరిస్తుంది. లాభాలన్నీ నేరుగా డ్రైవర్లకు వెళ్లేలా చేస్తుంది.
ఓలా, ర్యాపిడో, ఉబెర్ పై విమర్శలు:
ఓలా, ఉబెర్ వంటి సంస్థలు అమలు చేస్తున్న అనుచిత ధరల విధానాలపై విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. యూజర్ డివైజ్ల ఆధారంగా ఛార్జీలలో వ్యత్యాసాలు నమోదవుతున్నట్లు ప్రైవేట్ కంపెనీ సర్వీసులు పొందుతున్నవారు ఇటీవల పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సదరు కంపెనీలకు నోటీసులు జారీ చేయడంతో న్యాయమైన వాణిజ్య విధానాలపై చర్చ మరింత ముదిరింది.