Bank Robbery: బీహార్లోని సీతామఢీ జిల్లాలో ఘోరమైన సాయుధ దోపిడీ కలకలం రేపింది. రిగా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్హాది గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP) కేంద్రమే లక్ష్యంగా చేసుకున్న ముగ్గురు సాయుధ దుండగులు, కనురెప్పపాటులో రూ.1.70 లక్షల నగదుతో పరారయ్యారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతంలో, అది కూడా పట్టపగలే ఇంతటి సాహసానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది.
ఖాతాదారుల ముసుగులో వచ్చి.. షట్టర్ వేసి!
అయితే బ్యాంకింగ్ సేవల కోసం సాధారణ వ్యక్తుల్లాగే అపాచీ మోటార్సైకిల్పై ముగ్గురు దుండగులు అన్హాది గ్రామంలోని సీఎస్పీ కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో కేంద్రం నిర్వాహకుడు రాజేశ్వర్ ఠాకూర్ తన విధుల్లో మునిగిపోయి ఉన్నారు. లోపలికి ప్రవేశించిన నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కసారిగా కార్యాలయ ప్రధాన షట్టర్ను కిందికి దించేశారు. ఆ వెంటనే తుపాకులు బయటకు తీసి, రాజేశ్వర్ ఠాకూర్ను చుట్టుముట్టారు. గట్టిగా అరిస్తే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తూ, కౌంటర్లో ఉన్న నగదుతో పాటు ఆయన వద్ద ఉన్న వ్యక్తిగత సొమ్మును కూడా లాక్కున్నారు.
సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలు
ఈ భయానక దోపిడీ ఉదంతం మొత్తం సదరు సీఎస్పీ కేంద్రంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. గన్ పాయింట్లో నిర్వాహకుడిని భయపెట్టడం, నగదు సంచుల్లో నింపుకుని దుండగులు క్షణాల్లో బైక్పై పారిపోవడం వంటి దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే రిగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. బాధితుడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని, లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
వేట ప్రారంభించిన పోలీసులు.. త్వరలోనే అరెస్ట్!
ఈ ఘటనపై రిగా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రాజీవ్ కుమార్ సింగ్ స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు. దోపిడీ దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని, వారి కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశామని, అతి త్వరలోనే ఈ కేసును ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి నెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read: వాతావరణ శాఖ చల్లని కబురు.. వారం రోజుల పాటు దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!