Kolkata Hotel Fire: కోల్కతాలోని మిర్జా గాలిబ్ వీధి ఒకప్పుడు విదేశీ పర్యాటకులు, వైద్యం కోసం వచ్చే బంగ్లాదేశీయుల సందడితో కలకలలాడుతుండేది. కానీ, అక్కడ జరిగిన ఒక ఊహించని ఘోర అగ్నిప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను, విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
అగ్నికీలల్లో చిక్కుకున్న హోటల్
తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో హోటల్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న హోటల్ నిర్వాహకులు, అతిథులు దట్టమైన పొగతో ఊపిరాడక, మంటల వేడికి బయటకు పరుగులు తీసే అవకాశం లేక తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులే
ఈ ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ దేశస్థులుగా అధికారులు గుర్తించారు. వీరంతా మెరుగైన వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి ఈ హోటల్లో బస చేశారు. అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని రెస్క్యూ సిబ్బంది త్వరితగతిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కారణమేమై ఉంటుంది?
ఈ ప్రమాదానికి వైరింగ్ షార్ట్ సర్క్యూట్ లేదా గదిలోని ఏసీ పేలుడు ప్రధాన కారణం అయి ఉండవచ్చని పోలీసులు, అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.
Also Read: బాండ్ పేపర్ రాసిస్తా.. తెలంగాణలో గెలిచేది బీజేపీయే!- ధర్మపురి అర్వింద్