CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే తనదైన మార్క్ నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన తమ తొలి బడ్జెట్ లో సంక్షేమానికి విజయ్ పెద్ద పీట వేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను బడ్జెట్ ద్వారా కార్యారూపం ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి ఆధవ్ అర్జున తమ యంగ్ సీఎం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్ రోజుకు దాదాపు 18 నుంచి 20 గంటల పాటు నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు. తమ నాయకుడు ఉదయం 4 గంటలకే నిద్రలేచి మంత్రులకు ఫోన్లు చేస్తారన్నారు. ‘ఏ ఏ శాఖల్లో ఏం జరుగుతోంది? పాలన ఎలా సాగుతోంది? అని నేరుగా ఆరా తీస్తారు. ప్రజా సంక్షేమం కోసమే ఆయన సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తున్నారు. విజయం సాధించామన్న అహంకారం మా ప్రభుత్వంలో ఎవరికీ లేదు’ అని అర్జున పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీ వచ్చినప్పటికీ విజయ్ సంబరాలకు దూరంగా ఉన్నారని మంత్రి ఆధవ్ అర్జున అన్నారు. ఆయన ఈ విజయాన్ని తలకు ఎక్కించుకోకుండా బాధ్యతగా మసలుకుంటున్నారని పేర్కొన్నారు. ‘ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి నేను ఆయనను సచివాలయంలో ప్రతిరోజూ చూస్తున్నాను. విజయ్ ఒక ‘రాజకీయ సన్యాసి’ (Political Monk)లా కనిపిస్తారు. విజయాన్ని వేడుకగా జరుపుకోవడం కంటే.. తదుపరి ఏం చేయాలి? ఏ శాఖలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలి? అనే దానిపైనే ఆయన నిరంతరం ఆలోచిస్తున్నారు’ అని వివరించారు.
Also Read: విద్యార్థులపై దాడి వ్యవహారం.. సుప్రీం సంచలన నిర్ణయం.. విచారణకు హైపవర్ కమిటీ!
తమ ప్రభుత్వంలో అవినీతిని ఉపేక్షించేదే లేదని మంత్రి అన్నారు. తొలి 100 రోజుల పాలనలోనే పారదర్శకతను పెంచేందుకు విజయ్ ప్రభుత్వం బలమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే దశాబ్దాలుగా వ్యవస్థలో పేరుకుపోయిన కిందిస్థాయి అవినీతిని ఒక్కసారిగా తుడిచిపెట్టడం సవాలుతో కూడుకున్న విషయమని ఆయన అంగీకరించారు. సీఎం స్థాయి నుంచి మార్పునకు శ్రీకారం చుట్టామని, నిధుల దుర్వినియోగాన్ని తక్షణమే ఆపాలని అధికారులను విజయ్ గట్టిగా ఆదేశించినట్లు అర్జున వెల్లడించారు.
Also Read: మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!