Bengaluru Traffic : ఉదయాన్ని స్కూల్స్ కి బయలుదేరే పిల్లలు, ఆఫీస్ కి సమయానికి చేరుకోవాలనుకునే ఉద్యోగులు.. ఇంకోపక్క కాలేజీలు, కోచింగ్ ల కోసం పరుగులు పెట్టే యువత.. మరోపక్క వ్యాపారాలు.. వీళ్ల హడావిడి ప్రయాణాలతో ఉదయం కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే.. వీరంతా తిరిగి ఇళ్లకు చేరుకునే సమయంలోనూ ట్రాఫిక్ ఎక్కువే. ఆ కాస్తసేపు ట్రాఫిక్ లో చిక్కుకుంటేనే.. ఎక్కడలేని చిరాకు ముంచుకొస్తుంది. రోడ్లు వెడల్పు చేస్తే వీళ్ల సొమ్మేం పోతుంది.. అంటూ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మన పరిస్థితే అలా ఉంటే.. ఇక బెంగళూరులోని ప్రజల అవస్థలు గురించి తెలుసుకుంటే..మనం చాలా సౌకర్యంగా ఉన్నామనిపిస్తుంది. అవును.. ఇటీవల విడుదలైన ఓ నివేదిక వెల్లడిస్తున్న అంశాల ప్రకారం.. ఆసియాలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలుస్తోంది.
ఇటీవల టామ్ టామ్ అనే ట్రాఫిక్ ఇండెక్స్ సంస్థ అంతర్జాతీయంగా వివిధ నగరాల్లోని ట్రాఫిక్ కష్టాలపై ప్రత్యేకంగా నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. బెంగళూరులోని రోడ్లపై 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే.. ఏకంగా 28.10 నిముషాలు పడుతుంది అంటా.. భారత్ లోని మిగతా నగరాల్లో ఈ స్థాయిలో ట్రాఫిక్ లేకుపోవడంతో.. బెంగళూరు ఈ రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు.. ఆసియాలోనూ ఇలాంటి సిటి మరోకటి లేదని గుర్తించి.. ఆసియాలోనే అత్యంత రద్దీ ఉండే ట్రాఫిక్ నగరంగా ఓ చెత్త రికార్డును బెంగళురుకు అప్పగించారు. పాపం ఇక్కడి డ్రైవర్ల బాధల్ని వివరిస్తూ.. ఏడాదిలో ఏకంగా 132 అదనపు గంటలు ఈ ట్రాఫిక్ మాయాజాలంలో చిక్కుకుని, పొగ పీల్చుతూ గడుపుతున్నారని నివేదిక స్పష్టం చేసింది.
బెంగళూరు తర్వాతి స్థానాల్లో..
ఆసియాలోని అత్యంత రద్దీ ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు తర్వాత పుణే రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ అధికంగానే ఉన్నట్లు సర్వే సంస్థ వెల్లడిస్తోంది. వీరి గణాంకాల ప్రకారం.. 10 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 27.50 నిముషాల పాటు సమయం పడుతున్నట్లు గుర్తించారు. ఈ రెండు నగరాల తర్వాత.. కొద్దిపాటి తేడాలతో ఫిలిపైన్స్ లోని మనిలా, తైవాన్ లోని తాయ్ చుంగ్ నగరాలు 27.20, 26.50 నిముషాల వ్యవధితో తర్వాతి స్థానాల్లో నిలిచి.. అత్యంత రద్దీ నగరాల జాబితాలో చోటు సంపాదించాయి.
ఈ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ సంస్థ 55 నగరాల్లోని 387 నగరాల్లో ట్రాఫిక్ రద్దీని అంచనా వేసేందుకు నివేదిక రూపొందించింది. కాగా.. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలపై ఆలోచింపజేసే నివేదికను రూపొందించింది. అంతేకాదు.. ఇందులోని అంశాలు కేవలం ట్రాఫిక్ ను మాత్రమే కాదు, విపరీతంగా ఖర్చైపోతున్న ఇంధనం, వృథాగా గడిచిపోతున్న మానవ వనరుల అంశాన్ని ప్రస్తావించింది. ఏదో ఓ ఉపయోగపడే పనిలో కాలం గడపాల్సిన దేశవాసులు.. ట్రాఫిక్ చిక్కుల్లో చిక్కుకుని విలువైన సమయాన్ని గడిపేయడంతో పాటు వారి ఆరోగ్యాలు సైతం పాడవుతున్నాయనే విషయాన్ని ప్రస్తావించింది.
ఆలోచించాల్సిన సమయం వచ్చింది..
దేశీయ యువత, శ్రామికి వర్గాన్ని ట్రాఫిక్ చిక్కుల్లో నెడుతూ వారి విలువైన సమయాన్ని, దేశ వనరుల్ని వృథా చేస్తున్న తీరును ఈ నివేదిక వెల్లడించింది.
భారత్ ఇంధనం దిగుమతుల కోసం ఏటా రూ.16 లక్షల కోట్లు ఖర్చు పెడుతోందని ఇప్పటికే అనేక నివేదికలు తెలుపుతున్నాయి. ఈ అంశాన్ని ఈ నివేదిక సైతం బలపరుస్తోంది. అలాగే.. పట్టణ ప్రణాళికలపై సరికొత్త ఆలోచనలు చేయాల్సి అవసరాల్ని నొక్కి చెబుతోంది. అలాగే.. పాలకులు, విధాన రూపకర్తలకు కావాల్సిన సమాచారంతో పాటు ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించడంలో ఉపయోగపడనుంది.
సమస్య ఎక్కడ.. పరిష్కారం ఏంటి
పెరుగుతున్న ట్రాఫిక్ ఏటికేటా పెరిగిపోతున్న నగరీకరణకు సంకేతంగా కనిపిస్తోంది. పల్లెలు కనుమరుగు అవుతుండగా.. అంతా నగరాలు బాట పడుతున్నారు. అలాగే.. జనాభా పెరిగిన తీరుగానే ఏటా లక్షల కొత్త వాహనాలు దేశీయ రోడ్లపైకి వస్తున్నాయి. కాగా.. ఆ మేరకు రోడ్లను విస్తరించేందుకు వీలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దాంతో పాటే.. కాలం చెల్లిన వాహనాలు ఇంకా సర్వీసులో ఉండడంతో రోడ్లపై వాటి ప్రయాణంతో విపరీతంగా కాలష్య కారక వాయువులు విడుదల అవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా.. కాలం చెల్లిన వాహనాల్ని రోడ్లపై తిరగకుండా నిషేధించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. పెట్రోల్, డీజిల్ వాహనాల్ని వినియోగంలోకి తీసుకురావాలని.. వాటి స్థానంలో హైబ్రీడ్, ఎలక్ట్రికల్ వాహనాల వాడకం పెరగాలని సూచిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఇదే అంశాన్ని వివిధ వేదికలపై వెలిబుచ్చారు. దేశీయ రోడ్ల పై నుంచి 36 కోట్లకు పైగా డీజిల్, పెట్రోల్ వాహనాల్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వాటి స్థానంలో పర్యావరణ అనుకూల వాహనాలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని తెలిపారు. అందుకోసమే.. ఆయా వాహనాలపై పన్ను భారాన్ని భారీగా తగ్గించే ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు.