MCD: కొట్టుకున్నారు. తన్నుకున్నారు. గుద్దుకున్నారు. నెట్టుకున్నారు. చొక్కాలు చించుకున్నారు. సిగలు పట్టుకుని పొట్లాడుకున్నారు. నానారచ్చ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్-MCD రణరంగంగా మారింది. ఆ దృష్యాలు చూస్తుంటే.. వీరా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లు అనిపిస్తోంది. స్ట్రీట్ ఫైట్ మాదిరి.. సభలో బీజేపీ, ఆప్ సభ్యులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు.
స్టాండిగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహణ ఇలా ముష్టియుద్ధానికి దారి తీసింది. అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లలేదని మేయర్ ప్రకటించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అడ్డుకుంటూ బీజేపీ సభ్యులు రెచ్చిపోయారు. ఏకంగా మేయర్ షెల్లి ఓబెరాయ్ పైనే దాడికి దిగారు. పోలీసులు ఆపుతున్నా ఆగలేదు. మెజార్టీ బీజేపీ, ఆప్ సభ్యులు ఘర్షణకు దిగడంతో.. కౌన్సిల్లో రచ్చ రచ్చ నడిచింది.
జై శ్రీరామ్, జై మోదీ అంటూ బీజేపీ సభ్యులు పెద్దగా నినాదాలు చేశారు. ఆప్ వర్గమేమో.. ‘ఆమ్ ఆద్మీపార్టీ జిందాబాద్.. అర్వింద్ కేజ్రీవాల్ జిందాబాద్’ అంటూ గొంతెత్తుకుంది. ఇలా సభ హోరెత్తిపోయింది.
పరస్పర దాడిలో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమంది బట్టలు చిరిగిపోయాయి. ఓ కౌన్సిలర్ మూర్చపోయి కిందపడిపోయారు.
ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలిచింది. తాజాగా ఒక ఆప్ సభ్యుడు బీజేపీలో చేరాడు. దీంతో ఆప్ బలం 133కు తగ్గింది. శుక్రవారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆప్కు 138 మంది సభ్యుల ఓట్లు పడ్డాయి. ఐదుగురు బీజేపీ సభ్యులు ఆప్కి క్రాస్ ఓటింగ్ చేసినట్టు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే గెలిచామని ఆప్ నేతలు చెబుతున్నా.. బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.