BJP MLA Shaila Rani Rawat: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్(68) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను డెహ్రాడూన్లోని మాక్స్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస వదిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శైలారాణి రావత్కు వెన్నముక గాయమైంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెన్నముక కారణంగా పలుమార్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలోనే కన్నుమూశారు.
కేదార్నాథ్ ఎమ్మెల్యే మృతి చెందడం బాధాకరమని సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కేదార్నాథ్ అసెంబ్లీ నుంచి ప్రముఖ ఎమ్మెల్యే శైలారణి రావత్ మృతి చెందడం అత్యంత బాధాకరమైన వార్త వచ్చింది. ఆమె నిష్క్రమణ పార్టీతోపాటు ప్రజలకు తీరని లోటు, కర్తవ్య దీక్ష, ప్రజాసేవపై ఆమెకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.’ అంటూ సీఎం రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా..2012లో కాంగ్రెస్ టికెట్పై శైలారాణి రావత్ తొలిసారిగా కేదార్నాథ్ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2016లో ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్పై 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. అందులో శైలారాణి రావత్ కూడా ఉన్నారు. ఇక 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి చెందారు. అనంతరం 2022లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.
ALso Read: జెండర్ మార్చుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్.. సివిల్ సర్వీస్ చరిత్రలో ఇదే తొలిసారి!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్స్ వేదికగా ఆమె మృతిపై సానుభూతి ప్రకటించారు. ‘బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి మరణవార్త చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా.’ అంటూ రాసుకొచ్చారు. కాగా, కుటుంబ సభ్యులు తెలిపిర వివరాల ప్రకారం. .శైలారాణి రావత్ అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటలకు గుప్తకాశీలోని త్రివేణి ఘాట్లో నిర్వహించనున్నారు.