Ahmedabad Plane Crash : అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి అసలు కారణమేంటి? ఇప్పుడిదే ప్రశ్న కోట్లాది మంది మెదళ్లను తొలిచేస్తోంది? పైలట్ తప్పిదమా? సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొట్టడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరిగిందా? ఫ్లైట్లో ఎప్పటి నుంచో ఉన్న సమస్యల్ని గుర్తించకపోవడమే కారణమా? మరేదైనా రీజన్ ఉందా? వీటన్నింటికి మించి.. డ్రీమ్ లైనర్ డిజాస్టర్ వెనుక కుట్ర కోణం ఏమైనా దాగుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. మరెన్నో అనుమానాలు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే.. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు విమానంలో ఏం జరిగిందో తెలియాలంటే.. బ్లాక్ బాక్స్లోని డేటాని విశ్లేషించాల్సిందే. అదొక్కటే ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల్ని, అసలైన కారణాలను తెలియజేస్తుంది. ప్రమాదంపై రేకెత్తిన అన్ని ప్రశ్నలకు ఓ సమాధానంగా నిలుస్తుంది.
బ్లాక్ బాక్స్ డీకోడింగ్
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్, డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై.. డీజీసీఏ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ఇతర శాంపిల్స్ని కూడా ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది. ప్రమాదానికి గల అసలు కారణమేంటన్నది త్వరలోనే తేలనుంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులేంటి? విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కూలిపోయి.. పేలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఫ్లైట్లో ఏం జరిగిందనే విషయాలన్నీ.. త్వరలోనే బయటకు రానున్నాయి. ఈ వివరాలన్నీ బ్లాక్ బాక్స్లోనే ఉన్నాయి. ప్రమాదానికి గురయ్యే కొద్ది సెకన్ల ముందు పైలట్ సుమిత్ ఏటీసీ కాంటాక్ట్ అయ్యాడు. థ్రస్ట్ పనిచేయడం లేదంటూ ఏటీసీకి చెప్పాడు. కమ్యూనికేషన్ చాలా వీక్గా ఉండటంతో.. పైలట్ మే డే కాల్ చేశారు. బ్లాక్ బాక్స్ను వెలికితీసిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దాన్ని డీకోడ్ చేస్తోంది.
డీఎన్ఏ టెస్టులు చేస్తేనే..
మరోవైపు.. విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలం నుంచి వెలికితీసిన మృతదేహాలకు అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరికి డీఎన్ఏ టెస్టులు చేసి వారి కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 270కి చేరింది. చికిత్స తీసుకుంటున్న మరో నలుగురు బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థులు మృతి చెందారు. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను కూర్చున్న 11ఏ సీటు గాల్లో ఎగిరి పక్కకు పడిపోవడం వల్లే తాను బతికానని చెప్పాడు.
బోయింగ్కు బై బై..?
ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని చూశాక.. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై DGCA దృష్టి పెట్టింది. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానాలన్నింటిని తనిఖీ చేయాలని నిర్ణయించింది. బోయింగ్ విమానాలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని DGCA ఆదేశించింది. విమానాలు బయలుదేరే ముందు ఇంజన్లు పరిశీలించాలని కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా బోయింగ్ ఫ్లైట్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ విమానాలను భారత్లో నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి సేఫ్టీ రివ్యూ నిర్వహించేందుకు అమెరికా ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.