Union Budget 2025 : భారీ ఆశల మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీహార్ రాష్ట్రానికి కేంద్రం భారీ వరాలు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు ఆసక్తికరంగా మారాయి. కేంద్రంలో అధికారంలోని బీజేపీ.. తన కీలక మిత్రపక్షమైన నితీష్ కుమార్ జేడీయూతో అధికారాన్ని పంచుకుంటోంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ మార్కు చేరుకునేందుకు నితీష్ కుమార్ అందించిన మద్ధతుకు తిరిగి ప్రతిఫలం అందించే సమయం రావడం, రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన బీహార్ కు కేంద్రం భారీ ఆఫర్లను ప్రకటించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్ ప్రసంగంలో బీహార్ రాష్ట్రానికి మఖానా బోర్డును ప్రకటించారు. త్వరలోనే బీహార్ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. అలాగే.. కేంద్రం వివిధ పథకాల ద్వారా మఖానా రైతులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈ బోర్డు సహాయం చేయనుంది. దీని ద్వారా ఆ ప్రాంతంలోని మఖానా రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనుండగా, పక్కనే ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్మలా సీతారామన్ ప్రకటన నేపథ్యంలో ట్రెజరీ బెంచ్ వైపు నుంచి హర్షద్వానాలు వ్యక్తం అయ్యాయి.
వెనుబడిన రాష్ట్రంగా ఉన్న బీహార్ నుంచి పౌర విమాన సేవల్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రత్యేక సహాయం అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రంగ అభివృద్ధిలో భాగంగా.. బీహార్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ ప్రకటించారు. మిథిలాంచల్ ప్రాంతంలో ప్రత్యేక కాలువ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును కూడా ఆమె ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బీహార్ కు అనేక రంగాల్లో ప్రత్యేక ప్రయోజనం చేకూర్చిన కేంద్ర ప్రభుత్వం.. విద్యా రంగంలో పాట్నాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలరోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో కేంద్రం భారీ సాయాన్ని ప్రకటించింది. రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో అనేక మార్లు పొత్తులు మార్చిన నితీష్ కుమార్.. బీహార్ ముఖ్యమంత్రి కుర్చీపై పట్టు సాధించారు. ఆయన నేతృత్వంలోనే ఇప్పుడు మరోమారు ఎన్నికల సమరానికి జేడీయూ-బీజేపీ కూటమి సిద్ధమవుతోంది.
2024 లోక్సభ ఎన్నికలలో 12 సీట్లు సాధించిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా పనిచేసింది. అలాగే.. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మోజార్టీ సీట్లు అందించేందుకు బలంగా తోడుగా నిలుస్తున్నారపు. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం చేస్తోంది. రాజకీయంగా పార్టీల పొత్తుల దగ్గర నుంచి బడ్జెట్ ద్వారా అధిక ప్రయోజనాల్ని అందించి, వాటిని ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ ఏం పాపం చేసింది..
అయితే.. కేంద్రం తీరుపై ప్రతిపక్షాల నుంచి గట్టి విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీహార్ కు ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చడం సహజమే, కానీ.. ఏపీ ఏం పాపం చేసింది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను విస్మరించింది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఏన్ డీఏ ఏర్పాటులో మూల స్థంబంగా నిలిచిన ఆంధ్రా ప్రాంతాన్ని బడ్జెట్ ప్రసంగంలో విస్మరించడం తగదంటూ ఆరోపణలు చేశారు.