
Jamili elections in India(Latest political news in India):
ఒకే దేశం- ఒకే ఎన్నికలపై కేంద్రం మరో ముందడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు గల అవకాశాలను కోవింద్ కమిటీ పరిశీలిస్తుందని సమాచారం.
మరోవైపు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. అమృత్ కాల్ సంబరాలవేళ జరుగుతున్న ఈ సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు . కానీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12నే ముగిశాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ జరుగుతాయి. ఈలోపే ప్రత్యేక సమావేశాల ఏర్పాటు రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగానికి 5 సవరణలు చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఉభయ సభల కాలపరిమితిపై 83వ అధికరణ, లోక్సభ రద్దుపై 85వ అధికరణ, రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిపై 172వ అధికరణ, రాష్ట్రాల శాసన సభల రద్దుపై 174వ అధికరణ, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనపై 356 అధికరణలను సవరించాలి .
రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ లో రెండింట మూడొంతుల మెజారిటీ కావాలి. జమిలి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం అవసరమవుతుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశంఉంది. ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీలకు ప్రయోజనం కలుగుతుందని ప్రాంతీయ పార్టీల భావన.
రెండోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే జమిలి ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. కమిటీని వేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత లా కమిషన్కు ఈ విషయం నివేదించారు. అయితే లా కమిషన్ అనేక సిఫారసులు సూచించింది. జమిలి ఎన్నికలపై ఆచరణీయమైన రోడ్మ్యాప్ రూపొందించాల్సిందిగా ప్రభుత్వం లా కమిషన్ను కోరినట్లు జూలై 27న రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.