![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/e6bfd869a81f98ce424bfff9642fbe39.jpg)
Air Conditioned Truck: ఇకపై ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. 2025 అక్టోబర్ 1 తర్వాత తయారు చేసే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. N2, N3 కేటగిరీల పరిధిలోకి వచ్చే ట్రక్కులకు దీనిని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సరుకుల రవాణాకు ఉపయోగించే ట్రక్కుల స్థూల బరువు 3.5 టన్నుల నుంచి 12 టన్నుల వరకూ ఉంటే అవి N2 కేటగిరీ కిందకు వస్తాయి. 12 టన్నులు దాటిన నేపథ్యంలో ఆ ట్రక్కును N3గా వర్గీకరిస్తారు.
ట్రక్కు డ్రైవర్లకు మెరుగైన వాతావరణం కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ నూతన నిబంధన తెస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ జులైలోనే తెలిపారు. అందుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ కు ఆమోదం లభించినట్లు అప్పుడే చెప్పారు. దీనివల్ల డ్రైవర్ల పనిసామర్థ్యం పెరుగుతుందన్నారు. వేడివాతావరణంలో పనిచేసేవారికి ఇకపై అలసట నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. పని వాతావరణం మెరుగ్గా ఉంటే.. వారి మానసిక స్థితి కూడా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.