Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన మూడు కొత్త నేర చట్టాలు అమలును వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అయితే ఈ క్రిమినల్ చట్టాలను వాయిదా వేయడం వల్ల పార్లమెంట్లో వీటిపై సమీక్ష జరిపేందుకు అవకాశం ఉంటుందని దీదీ పేర్కొన్నారు.
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టింది. అయితే బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టాల స్థానంలో కేంద్రం వీటిని తీసుకొచ్చింది. ఈ చట్టాలను.. దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్దేశ్యంతో వీటిని రూపొందించారు. న్యాయ వ్యవస్థతో పాటు కోర్టు నిర్వాహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడనన్నాయి.
146 మంది పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్తో దెబ్బతిన్న సెషన్లో బిల్లులు శాసన సభలో ఆమోదించారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం క్లిష్టమైన మూడు బిల్లులను ఏకపక్షంగా, ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించింది. బిల్లులు ఆమోదం పొందిన రోజు దాదాపు 100 మంది లోక్ సభ సభ్యులను సస్పెండ్ చేశారు. ఉభయ సభలకు చెందిన మొత్తం 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి బయటకు పంపారు. నిరంకుశ పద్దతిలో బిల్లులు ఆమోదించబడ్డాయి. వీటి అమలును వాయిదా వేయడం ద్వారా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ ఈ చట్టాలను క్షుణ్ణంగా సమీక్షించడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుంది.
Also Read: నీట్ వివాదంపై స్పందించిన జైరాం రమేష్.. మోదీ సర్కార్పై ఫైర్
ప్రజాస్వామ్య చట్టాలను నిలబెట్టడానికి, అంతే కాకుండా శాసన ప్రక్రియలపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది ఎంతగానో అవసరం. భారతీయ న్యాయ సంహితతో పాటు మరో రెండు బిల్లుల అమలును వాయిదా వేయాలి..మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోండి అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.