Melinda French Gates Comments: ఇంకొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ప్రచారం కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రముఖ మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా గేట్స్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కే అంటూ ఆమె అందులో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ నేతకు ఆమె బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే మొదటిసారి.
‘గతంలో ఈ విధంగా నేనెప్పుడూ కూడా అధ్యక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదు. కానీ, ఈసారి జరిగే ఎన్నికలు మహిళలు, కుటుంబాలకు చాలా ముఖ్యమైనవి. అందుకే, నేను మౌనంగా ఉండలేకపోయాను. మహిళల భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక శక్తి, వ్యక్తిగత హక్కులను కాపాడే నాయకుడు కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలు పూర్తిగా భాగస్వాములయ్యే విధంగా వారికి స్వేచ్ఛను కల్పించాలి. ఈసారి నా ఓటు అధ్యక్షుడు బైడెన్కే వేస్తాను’ అంటూ ఆమె అందులో పేర్కొన్నారు.
అదేవిధంగా ఆమె ట్రంప్పై కూడా పలు విమర్శలు చేశారు. అతని హయాంలో మహిళల ఆరోగ్యం, భద్రత, స్వేచ్ఛను ప్రమాదంలో పడేశారంటూ ఆమె విమర్శించారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ‘ది బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ 1.8 మిలియన్ డాలర్ల విరాళాలు అందించింది. ఈ విరాళాల్లో ఎక్కువ భాగం డెమోక్రాట్లకే వెళ్లినట్లు తెలిసింది.
Also Read: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన..గ్రాడ్యుయేట్ పూర్తయిన వెంటనే గ్రీన్ కార్డు!
కాగా, 2021లో బిల్గేట్స్ నుంచి ఆమె విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దాతృత్వ కార్యక్రమాల కోసం స్థాపించిన గేట్స్ ఫౌండేషన్ నుంచి కూడా మిలిందా గేట్స్ వైదొలిగారు. ఆ తరువాత ఆమె తన సొంతంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా మహిళల సాధికారత కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మహిళల హక్కులు, వారి ఆర్థిక స్వావలంబన కోసం ఇటీవలే బిలియన్ డాలర్ల ఫండ్ను కూడా ఆమె ప్రకటించారు.