CM Siddaramaiah Comments: ప్రధాని మోదీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మోదీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు మరియు దళితుల రిజర్వేషన్ కోటాను ముస్లింలకు బదిలీ చేసిందని ప్రధాని మోదీ అన్నారని.. అది పచ్చి అబద్ధమని సిద్ధరామయ్య అన్నారు. అలా మాట్లాడడం మోదీ అజ్ఞానికి నిదర్శనమన్నారు. అంతేకాదు.. మోదీకి ఓటమి భయం ఏర్పడి నిరాశతో అలా మాట్లాడుతున్నారని సిద్ధరామయ్య అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు ఇలా మాట్లాడటలేదంటూ మోదీపై సీఎం ఫైరయ్యారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధాని మోదీ ఇలా మాట్లాడడం సరికాదన్నారు. అంతేకాదు.. తమ ప్రభుత్వం నిజంగానే వెనుకబడిన తరగతులు, దళితుల రిజర్వేషన్ ను ముస్లింలకు బదిలీ చేసిందని చెప్పిన మోదీ అందుకు సంబంధించి ఆధారాలు చూపించాలి.. లేదా జాతికి మోదీ క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను ఏకపక్షంగా సవరించలేమన్నారు. ‘సామాజిక మరియు ఆర్థిక సర్వేల నివేదిక ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లకు సవరణలు చేయొచ్చు. అంతేకానీ, షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలకు సంబంధించిన రిజర్వేషన్లను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అలాంటి సవరణలకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం ఉండాలి. ఈ విషయం ప్రధానమంత్రికి తెలియకపోవడం మన దేశానికి నిజంగా విషాదకరం’ అని సీఎం సిద్ధ రామయ్య అన్నారు. గత పదేళ్లుగా పాలించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించకపోవడం ఆయన విఫల నాయకుడని నిరూపిస్తున్నదని సీఎం అన్నారు.
Also Read:లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..
అదేవిధంగా, కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రధాని మోదీపై మండిపడిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ కూడా ప్రధానిపై ఫైరైన విషయం విధితమే. గత పదేళ్ల హయాంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో.. సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రజలకు వివరించాలని కానీ, ఇలా ప్రతిపక్షాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. బీహార్ లో ప్రజల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించిన విషయం కూడా విధితమే.