First Phase Lok Sabha Polls 2024 : దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిదశ లోక్ సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. నేటితో ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు, స్పీకర్లు మూగబోనున్నాయి. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేసింది.
ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అసోం రాష్ట్రాలతో పాటు.. కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ లలోనూ తొలిదశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఆయా ప్రాంతాల్లో బందోబస్తుకు ఇప్పటికే కేంద్రబలగాలు మోహరించాయి.
యూపీలోని షహరాన్ పూర్, కైరానా, ముజఫర్ నగర్, నగినా, బిజనూర్, పిల్ బిత్, మొరాదాబాద్, రామ్ పూర్ స్థానాలకు.. వెస్ట్ బెంగాల్ లోని కుచ్ బిహార్, జల్పైగురి, అలీపుర్ దౌర్స్ లోక్ సభ స్థానాలకు, మహారాష్ట్రలోని రామ్ టెక్, నాగ్ పూర్, గడ్చిరౌలి, బందారా గోండియా, చంద్రాపూర్, చిముర్ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ లో 2, మణిపూర్ లో 2, మేఘాలయలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్ లో 1, సిక్కిం, త్రిపుర, ఛత్తీస్ గఢ్, జమ్ము-కశ్మీర్ లలో ఒక్కో లోక్ సభ స్థానానికి, ఉత్తరాఖండ్ లో 5 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఏప్రిల్ 26న, మూడో విడత మే7న, నాల్గో విడత మే 13న, ఐదో విడత మే 20న, ఆరో విడత మే 25న, ఏడో విడత ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి.