దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముష్కరుల ఇంటరాగేషన్ లో భయంకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట దగ్గర కారు బాంబు పేల్చిన దుండగులు, దేశ వ్యాప్తంగా 4 ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో పేలుళ్లకు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి 8 మంది కీలక ఉగ్రవాదులను పట్టుకుని విచారణ చేస్తున్నారు. ఈ 8 మంది నాలుగు గ్రూపులుగా ఏర్పడి, దేశ వ్యాప్తంగా నాలుగు ప్రధాన నగరాల్లో బాంబు దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం వారు శక్తివంతమైన IEDలను తీసుకెళ్లాలని భావించినట్లు తెలిపారు. “ఎనిమిది మంది ముష్కరులు నాలుగు ప్రదేశాలలో వరుస పేలుళ్లకు ప్లాన్ చేశారు. వారు ఇద్దరు చొప్పున నాలుగు గ్రూపులుగా నాలుగు నగరాలకు వెళ్లాలని ప్లాన్ చేశారు. ప్రతి బృందం వారితో పాటు శక్తివంతమైన IEDలను తీసుకెళ్లాలని భావించారు” అని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఎర్రకోట బ్లాస్ వెనుక కూడా పెద్ద ప్లాన్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జనవరి 26న ఈ పేలుడుకు కుట్ర చేసినట్లు తెలిపారు. ఇందుకోసం డాక్టర్లు ముజమ్మిల్, అదీల్, ఉమర్, షాహీన్ సుమారు రూ.20 లక్షలను సేకరించినట్లు వెల్లడించారు. ఆ డబ్బును ఢిల్లీ పేలుడుకు ముందు ఉమర్ కు అప్పగించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ తర్వాత గురుగ్రామ్, నుహ్ తో పాటు సమీప ప్రాంతాల నుంచి IED తయారీ కోసం రూ. 3 లక్షల విలువైన 20 క్వింటాళ్లకు పైగా NPK ఎరువులను సేకరించినట్లు వివరించారు. మరోవైపు ఉమర్, ముజమ్మిల్ మధ్య డబ్బు వివాదం తలెత్తినట్లు వెల్లడించారు. అదే సమయంలో దర్యాప్తు బృందాలకు తమ కదలికల గురించి తెలియడంతో, భయాందోళనలో ఈ బ్లాక్ చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. లేదంటే అనుకున్నట్లుగానే నాలుగు నగరాల్లో పెను విధ్వంసానికి పాల్పడే ప్రయత్నం చేసేవారన్నారు. అటు ఈ పేలుళ్లకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నారా? లేదా? అనే అంశంపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. i20, ఎకోస్పోర్ట్ కేసుల తర్వాత, అనుమానితులు పేలుడు పదార్థాలను ఏర్పాటు చేసేందుకు మరో రెండు పాత వాహనాలను రెడీ చేయాలని భావించినట్లు గుర్తించాయి.
అటు ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ కారు పేలుడు ఘటనపై దర్యాప్తు చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పోలీసు సూపరింటెండెంట్, అంతకంటే ఎక్కువ స్థాయి సీనియర్ అధికారుల నేతృత్వంలోని దర్యాప్తు బృందం త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రసంస్థ ఈ ఘటనకు పాల్పడినట్లు భద్రతా సంస్థలు ఇప్పటికే అంచనాకు వచ్చాయి.
Read Also: గత 5 ఏళ్లలో దేశంలో జరిగిన బాంబు పేలుళ్లు ఇవే, ఎంత మంది చనిపోయారంటే?