Delhi Assembly Election 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఒకే దశలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. బరిలో 699 మంది అభ్యర్థులు… తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం కోటి 56 లక్షల మంది ఓటర్లు ఉండగా… 13వేల 766 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా 733 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో.. 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ కోసం ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఎన్నికల విధుల్లో భాగంగా 220 కంపెనీల పారా మిలిటరీ బలగాలను మోహరించింది. 35 వేల 626 మంది ఢిల్లీ పోలీసులతో పాటు 19 వేల మంది హోంగార్డులు కూడా ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. సుమారు 3 వేల పోలింగ్ బూత్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించడంతో… ఆయా ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్లను కూడా సంసిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ తెలుసుకునేందుకు క్యూ మేనేజిమెంట్ సిస్టమ్ను తొలిసారి ప్రవేశపెడుతున్నారు. పోలింగ్ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు.
దేశ రాజధాని ఢిల్లీ ఓటర్లు మరోసారి ఆప్కే పట్టం కడతారా..లేక, బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తారా?, లేదంటే అనూహ్యంగా కాంగ్రెస్ను ఆదరిస్తారా అనే అంశం ఉత్కంఠగా మారింది. త్రికోణ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఈనెల 8న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2015లో..ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. 70 స్థానాలకుగానూ ఏకంగా 67 చోట్ల విజయం సాధించింది.
కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయధుందుబి మోగించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే, ఈసారి ఎలాగైనా పుంజుకోవాలనే లక్ష్యంతో ఆప్, బీజేపీలతో సమానంగా ప్రచారాన్ని నిర్వహించింది. హస్తం పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు.
Also Read: భారత్కు చేరిన 400 లకు పైగా పాకిస్తానీ హిందువుల చితాభస్మం, ఏళ్ల నిరీక్షణ ఎందుకంటే ?
ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం నిర్వహించారు. ఆప్ కూడా ధీటుగానే ప్రచారాన్ని నిర్వహించింది. మొత్తంగా చూస్తే.. అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు ఖాయంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు సంక్షేమ పథకాలను పెద్ద సంఖ్యలో ప్రకటించాయి.
ఈసారి ఎవరు ఢిల్లీ పీఠాన్నీ కైవసం చేసుకుంటారో ఫిబ్రవరి 8న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాత తెలుస్తుంది.1998 నుంచి ఢిల్లీలో అధికారంలో లేకపోవడం వల్ల ఈసారి ఎలాగైనా పట్టు సాధించడానికి సర్వసక్తులు ప్రయత్నం చేస్తోంది బీజేపీ. పోటాపోటీగా హామీలు గుప్పించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్, బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీల అగ్ర నేతలు. గెలుపు పై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న మూడు పార్టీలు.
Celebration of #deshkaparv #chunavkaparv in Pink Booth in AC-39, Karol Bagh MCD #DelhiAssemblyElection2025 @MCD_Delhi @DMNewDelhi @AssistantZ @CeodelhiOffice pic.twitter.com/DIeuqtmX0e
— Deputy Commissioner, Karol Bagh Zone,MCD (@kbzdc) February 4, 2025