Digvijaya Singh: తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్.. దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై తీవ్ర విమర్శలు చేసే దిగ్విజయ్ సింగ్.. ఒక్కసారిగా ప్లేట్ మార్చారు.. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఆర్ఎస్ఎస్ సంస్థాగత పనితీరును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి.
దిగ్విజయ్ సింగ్ తన పోస్ట్లో Quora వెబ్సైట్కు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ను షేర్ చేశారు. ఆ స్క్రీన్ షాట్లో 1990వ దశకంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయంలో తీసిన ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ సోఫాలో కూర్చుని ఉండగా.. అప్పట్లో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోదీ ఆయన పాదాల చెంత కింద నేల మీద కూర్చుని ఉన్నారు.
ఆ ఫోటోను ఉద్దేశించి దిగ్విజయ్ ఈ విధంగా రాసుకొచ్చారు. ఈ ఫోటో తనని ఎంతో ప్రభావితం చేసిందని వ్యాఖ్యానించారు. ఒక సాధారణ కార్యకర్త నేల మీద కూర్చునే స్థాయి నుండి.. ముఖ్యమంత్రిగా, ఆపై దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ క్రమశిక్షణ, శక్తికి నిదర్శనం. జై సియా రామ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
దిగ్విజయ్ సింగ్ ఈ ట్వీట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్లను ట్యాగ్ చేయడం గమనార్హం. దీని ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత నిర్మాణంపై పరోక్ష విమర్శలు చేసినట్లు భావిస్తున్నారు.
దిగ్విజయ్ సింగ్ పార్టీ వికేంద్రీకరణపై కూడా ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల సంఘంలో సంస్కరణలు అవసరమైనట్టే, రాజకీయ పార్టీల్లో కూడా సంస్కరణలు రావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పార్టీ లోపల అధికారాలు కేంద్రీకృతమవకుండా, కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఇదే అంశంపై ఈ నెల 19న కూడా ఆయన ట్వీట్ చేసినట్లు గుర్తు చేశారు.
Also Read: MGNREGAను రద్దు చేసి.. పేదల కడుపుకొట్టారు: మల్లికార్జున ఖర్గే
అయితే ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్లో కొంత అసహనం కలిగించాయన్న ప్రచారం కూడా జరిగింది. దీన్ని గ్రహించిన దిగ్విజయ్ సింగ్ వెంటనే వివరణ ఇచ్చారు. నేను మోదీ విధానాలకు, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకమే. అందులో ఎలాంటి మార్పు లేదు. కానీ వారి సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యతను మాత్రమే మెచ్చుకున్నాను. దీనికి రాజకీయ అర్థాలు వెతకాల్సిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద పోస్టు
ప్రధాని మోడీ పాత ఫోటోను ఎక్స్ లో పోస్టు చేసిన దిగ్విజయ్ సింగ్
ఎల్.కే. అడ్వాణీ కుర్చీలో కూర్చొని ఉండగా నేలపై కూర్చొన్న మోడీ
నేలపై కూర్చొన్న వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారంటూ బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రశంసించిన… pic.twitter.com/2V4TZC59LQ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2025