Bangaluru : బెంగళూరు తొక్కిసలాట. 11 మంది మృతి. 50 మందికిపైగా గాయాలు. ఆ దారుణం ఎలా జరిగింది? పాపం ఎవరిది? తప్పు ఎక్కడుంది? శిక్ష ఎవరికి పడాలి? ఘటనపై సుమోటోగా తీసుకున్న హైకోర్టు విచారణ జరుపుతోంది. కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించింది.
తొక్కిసలాట ఘటనపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణ జరుపుతోందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసులో అరెస్టులు చేస్తున్నది మాత్రం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్. దీనిపై హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ విచారణలో జరిగిన తప్పిదాలను అంగీకరించారు. ఇదే సమయంలో హైకోర్టు.. AGకి తొమ్మిది ప్రశ్నలు సంధించింది.
హైకోర్టు 9 ప్రశ్నలు..
RCB విక్టరీ సెలబ్రేషన్స్కు అనుమతిని ఇచ్చింది ఎవరు? ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు తీసుకున్న చర్యలేంటి? ప్రజలను కంట్రోల్ చేసేందుకు తీసుకున్న చర్యలేంటి? వేదిక ప్రాంతంలో ఎలాంటి వైద్య, ఇతర సదుపాయాలు కల్పించారు? ఎంతమంది ప్రజలు వస్తారో ముందే అంచనాకు వచ్చారా? వేడుక సమయంలో అక్కడ ఎవరుంటారో తెలుసా? గాయపడిన వారికి వెంటనే వైద్యం అందించారా? లేదంటే ఎందుకు? గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎంత సమయం పట్టింది? 50 వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది వచ్చే ఈవెంట్ కోసం ఏదైనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ ఉందా? ఆర్గనైజర్లు ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి కోరారా? ఇలా ప్రశ్నలు సంధించి.. వాటికి సమాధానాలు చెప్పాలని ఆదేశించింది.
హైకోర్టు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు కాస్త సమయం కావాలని AG కోర్టును కోరారు. సీల్డ్ కవర్లో ఆన్నర్స్ను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.