Delhi High Court Judge Huge Cash|ఒక న్యాయమూర్తి అవినీతి బాగోతాన్ని విధి వెల్లడించింది. ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనతో అవినీతి సొమ్మంతా బయటపడింది. దేశ రాజధానిలో నివసించే ఒక హై కోర్టు న్యాయమూర్తి.. హోలీ పండుగ కోసం కుటుంబంతో కలిసి సొంత ఊరికి వెళ్లారు. అదే సమయంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న సమయంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సంఘటనతో అందరూ షాక్కు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనపై వేటు పడింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yaswant Varma) ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లభించిన కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో సుప్రీం కోర్టు కొలీజియం (Supreme Court Collegium) ఏకగ్రీవంగా ఆయనపై వేటు వేయాలని భావించింది. అందుకే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే బదిలీ చేసింది. ఢిల్లీ హై కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
మార్చి 14న జస్టిస్ వర్మ ఇంట్లో లేని సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పే సమయంలో సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి చేరవేశారు. అయితే, ఆయన ఇంట్లో లభించిన భారీ నగదు మొత్తం ఎంత అనేది బహిర్గతం కాలేదు.
Also Read: ఇండియా కంటే పాకిస్తాన్ బెటర్.. ఆనందానికి దూరమవుతున్న భారతీయులు
జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో న్యాయ వ్యవస్థ అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉందని సీజేఐ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయనని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేయకుంటే, అంతర్గత దర్యాప్తు జరిపించి, ఆ తర్వాత పార్లమెంట్ ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు, నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు.
యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ
అవినీతి, అనుచిత ప్రవర్తనకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యలు తీసుకోవడానికి 1999లో సుప్రీం కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. మొదట భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి నుంచి వివరణ కోరాలి. ఆ వివరణతో సంతృప్తి చెందితే ఫర్వాలేదు. లేకపోతే, ఒక కమిటీని ఏర్పాటు చేసి అంతర్గత దర్యాప్తు జరపాలి. ఈ కమిటీలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు. అప్పుడు ఆ న్యాయమూర్తి రాజీనామా చేస్తే ఫర్వాలేదు. ఒకవేళ రాజీనామా చేయని పక్షంలో.. ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం.. సదరు న్యాయమూర్తిని తొలగించే అధికారం పార్లమెంట్కు ఉంది.