జనవరి 26న కర్తవ్య పథ్పై భారత వైమానిక దళం (IAF) ప్రదర్శించే వీరోచిత విన్యాసాలను చూసి దేశం గర్విస్తుంది. అయితే, ఈ విన్యాసాల వెనుక ఒక అతిపెద్ద సవాలు పొంచి ఉంది. అదే బర్డ్ స్ట్రైక్ (పక్షులు విమానాలను ఢీకొనడం). ముఖ్యంగా ఢిల్లీ గగనతలంలో విపరీతంగా తిరిగే గద్దల వంటి పక్షుల వల్ల రఫెల్, సుఖోయ్-30MKI వంటి శక్తివంతమైన యుద్ధ విమానాలకు పెద్ద ముప్పు ఉంటుంది. ఈ ముప్పును నివారించేందుకు ఢిల్లీ అటవీ శాఖ, ఐఏఎఫ్ సంయుక్తంగా ఒక అసాధారణమైన ఆపరేషన్ను ప్రారంభించాయి.
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల భద్రతలో భాగంగా సుమారు 1,275 కిలోల బోన్లెస్ చికెన్ను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వెదజల్లుతున్నారు. దీనిని మీట్-త్రోయింగ్ ఎక్సర్సైజ్ అని పిలుస్తారు. జనవరి 15 నుంచే ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా.. పక్షులను యుద్ధ విమానాలు ఎగిరే మార్గాల నుండి దూరంగా మళ్లించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. పక్షులకు ఆహారాన్ని ఒక నిర్దేశిత ప్రాంతంలో అలవాటు చేయడం ద్వారా, అవి విన్యాసాలు జరిగే సమయంలో ఆకాశంలో ఎత్తుకు వెళ్లకుండా కింది స్థాయిలోనే ఉండేలా చూస్తున్నారు.
పక్షులు సహజంగానే ఆహారం దొరికే చోట గుంపులుగా చేరతాయి. విమానాలు ప్రయాణించే కిల్ జోన్స్ లోకి ఈ పక్షులు వెళ్లకుండా ఉండాలంటే, వాటికి భూమికి దగ్గరగా ఆహారాన్ని అందించడం ఉత్తమ మార్గమని అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా 20 నుండి 30 గ్రాముల చిన్న చిన్న చికెన్ ముక్కలను 20 కీలక ప్రాంతాల్లో వెద జల్లుతున్నారు. దీనివల్ల పక్షులు కడుపు నిండా తిని, సంతృప్తిగా కిందనే ఉండిపోతాయి. ఫలితంగా జెట్ విమానాలు వేగంగా దూసుకుపోయే సమయంలో గగనతలం ఖాళీగా ఉంటుంది.
గతంలో పక్షులను ఆకర్షించడానికి బఫెలో మీట్ ఉపయోగించేవారు. కానీ 2026లో మొదటిసారిగా బోన్లెస్ చికెన్ను వాడుతున్నారు. వన్యప్రాణుల నిర్వహణ, లాజిస్టిక్స్ సౌలభ్యం దృష్ట్యా ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. వజీరాబాద్లోని వైల్డ్లైఫ్ రెస్క్యూ సెంటర్కు ఈ మాంసాన్ని దశలవారీగా సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా జనవరి 22న జరిగే ఫుల్ డ్రెస్ రిహార్సల్ సమయంలో అత్యధికంగా 255 కిలోల మాంసాన్ని వెదజల్లనున్నారు.
కీలక ప్రాంతాలపై నజర్
పక్షుల కదలికల డేటా ఆధారంగా రెడ్ పోర్ట్, జమా మసీద్, మండి హౌస్, ఢిల్లీ గేట్ వంటి ప్రాంతాలను హాట్స్పాట్స్ గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పక్షుల సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇక్కడ ఆహారాన్ని ఎక్కువగా వేస్తున్నారు. తద్వారా పక్షులకు ఒక స్థిరమైన ఆహారం అలవాటు అవుతుంది. ఒకవైపు యుద్ధ విమానాల గర్జనతో ఢిల్లీ ఆకాశం హోరెత్తుతుంటే.. మరోవైపు నిశ్శబ్దంగా సాగే ఈ గ్రౌండ్ ఆపరేషన్ మన పైలట్ల భద్రతను నిర్ధారిస్తోంది.